
న్యూఢిల్లీ: వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్స్లో ఓడిపోవడంతో ఇండియా టెస్ట్ టీమ్లో భారీ మార్పులు చేయనున్నారు. ఇందులో భాగంగా సీనియర్లపై వేటు వేసి కొత్త ముఖాలను తీసుకురావాలని బీసీసీఐ భావిస్తోంది. వచ్చే నెలలో వెస్టిండీస్తో జరిగే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్తో కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ మొదలవుతుంది. దీంతో విండీస్తో పోరుకోసం వచ్చే వారంలో ఇండియా టీమ్ను సెలెక్టర్లు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను తిరిగి టెస్ట్ల్లోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. బ్యాక్ ఇంజ్యురీ కారణంగా 2018 నుంచి పాండ్యా ఈ ఫార్మాట్కు దూరంగా ఉంటున్నాడు. కెప్టెన్ రోహిత్, కోహ్లీని ఈ సిరీస్కు కొనసాగించనున్నారు. అయితే పుజారా ప్లేస్లో సూర్య, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్కు చాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు.