
నేడు వెస్టిండీస్తో రెండో వన్డే
బ్యాటింగ్ ఆర్డర్పై టీమిండియా దృష్టి
గెలుపే లక్ష్యంగా విండీస్
రా. 7 నుంచి జియో సినిమా, డీడీ స్పోర్ట్స్లో లైవ్
బార్బడోస్: ఓవైపు ఆసియా కప్.. మరోవైపు వన్డే వరల్డ్కప్.. ఈ రెండింటి ప్రిపరేషన్స్లో ఉన్న టీమిండియా.. వెస్టిండీస్తో రెండో వన్డేకు రెడీ అయ్యింది. శనివారం జరిగే ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ పట్టేయాలని ఇండియా టార్గెట్గా పెట్టుకుంటే.. లెక్క సరి చేయాలని కరీబియన్లు భావిస్తున్నారు. వరల్డ్కప్కు ముందు 11 మ్యాచ్లే మిగిలి ఉండటం, ఐపీఎల్లో రాణించిన యంగ్స్టర్స్ తొలి మ్యాచ్లో తేలిపోవడంతో టీమిండియా మేనేజ్మెంట్ మొత్తం ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్పై ఫోకస్ పెట్టింది. యంగ్స్టర్స్కు మరో చాన్స్ ఇచ్చి మెగా ఈవెంట్ ప్రణాళికలకు సరిపోతారో లేదో చూడాలని భావిస్తోంది. దీంతో సీనియర్లతో పాటు యంగ్స్టర్స్ కూడా ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సూర్య, గిల్పై ఫోకస్
తొలి వన్డేలో చిన్న టార్గెట్ను ఛేదించడంలో కుర్రాళ్లు ఘోరంగా ఫెయిలయ్యారు. ఒక్క ఇషాన్ కిషన్ మినహా భారీ ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్, శుభ్మన్ గిల్ విఫలం కావడం టీమిండియా మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది. వన్డే వరల్డ్కప్లో ఈ ఇద్దరు కీలకమని భావిస్తున్న నేపథ్యంలో రెండో వన్డేలో వీళ్లు ఎలా ఆడతారన్న ప్రశ్నలు కూడా మొదలయ్యాయి. శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో ఈ ఇద్దరిలో ఒకరు మాత్రం కచ్చితంగా మిడిలార్డర్ బాధ్యతలు మోయాల్సి ఉంటుంది. ఇక సీనియర్లలో కోహ్లీ, రోహిత్ ఫామ్పై పెద్దగా సందేహాలు లేకపోయినా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వైఫల్యం టీమ్ను వెంటాడుతున్నది. రిజర్వ్లో ఉన్న సంజూ శాంసన్కు ఈ మ్యాచ్లో చాన్స్ ఇస్తారా? చూడాలి. సీనియర్ బౌలర్లు లేకపోయినా తొలి మ్యాచ్లో ఇండియా బౌలింగ్ అదిరిపోయింది. పేసర్లు పెద్దగా ప్రభావం చూపకపోయినా స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ ఆకట్టుకున్నారు. అయితే ఈ ఇద్దరిలో ఒకర్ని తప్పించి చహల్ లేదా అక్షర్ పటేల్కు తుది జట్టులో చోటు కల్పిస్తారా? కొత్తగా వచ్చిన ముకేశ్ కుమార్ అవుట్సైడ్ ఆఫ్ బాల్స్పైనే ఎక్కువగా గురి పెట్టడం ప్రతికూలాంశం. శార్దూల్, పాండ్యా బౌలింగ్లోనూ మెరవాల్సి ఉంది.
పోటీ ఇస్తారా?
తొలి వన్డేలో అన్ని అంశాల్లో తేలిపోయిన వెస్టిండీస్ ఈ మ్యాచ్లోనైనా పోటీ ఇస్తుందో లేదో చూడాలి. కెప్టెన్ షై హోప్, అథనాజే తప్ప మిగతా బ్యాటర్లు క్రీజులో నిలబడే సాహసం కూడా చేయలేదు. కరీబియన్ ఫాస్ట్ పిచ్లపై దీటుగా నిలబడతారనుకుంటే స్పిన్నర్ల దెబ్బకు కుదేలు కావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ మ్యాచ్ కోసం విండీస్ మేనేజ్మెంట్ ఫైనల్ ఎలెవన్లో మార్పులు చేసే చాన్స్ కనిపిస్తున్నది. బౌలింగ్లోనూ రిస్ట్ స్పిన్నర్ పావెల్పై ఆశలు పెట్టుకున్నా అతను పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో అతని ప్లేస్లో కార్టీని బరిలోకి దించొచ్చు. బ్యాటింగ్లో బ్రెండన్ కింగ్, కైల్ మేయర్స్, హోప్, హెట్మయర్ చెలరేగితే భారీ స్కోరును ఆశించొచ్చు.
జట్లు (అంచనా)
ఇండియా: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, శాంసన్ / ఇషాన్ కిషన్, జడేజా, శార్దూల్, కుల్దీప్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్.
వెస్టిండీస్: హోప్ (కెప్టెన్), బ్రెండ్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అథనాజే, హెట్మయర్, పావెల్ / కేసీ కార్టీ, షెఫర్డ్, డొమినిక్ డ్రేక్స్, యానిక్ కారియా, గుడకేశ్ మోతీ, జైడేన్ సీల్స్ / అల్జారీ జోసెఫ్ / ఒషానె థామస్.