
ముంబై: టీమిండియా టెస్టు టీమ్లో భారీ మార్పులకు వేళయింది. లెజెండరీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ అనంతరం లాంగ్ ఫార్మాట్కు కొత్త కెప్టెన్తో పాటు ఇంగ్లండ్తో వచ్చే నెలలో జరిగే ఐదు మ్యాచ్ల సిరీస్లో తలపడే టీమ్ను సెలెక్టర్లు శనివారం ఎంపిక చేయనున్నారు. రోహిత్ వారసుడిగా 25 ఏండ్ల శుభ్మన్ గిల్ కెప్టెన్సీ రేసులో ముందంజలో ఉన్నాడు. గత ఆస్ట్రేలియా టూర్లో వైస్ -కెప్టెన్, స్టాండిన్ కెప్టెన్గా వ్యవహరించిన బుమ్రా పేరు కూడా పరిశీలనలో ఉంది.
కానీ, నాయకత్వం వల్ల అతని ఫిట్నెస్, పనిభారం వంటి అంశాలు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. రిషబ్ పంత్కు వైస్- కెప్టెన్సీ అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెప్టెన్సీ మార్పు మినహా జట్టులో పెద్దగా ప్రయోగాలు ఉండకపోవచ్చని తెలుస్తోంది. జూన్ 20న లీడ్స్లో ప్రారంభమయ్యే తొలి టెస్టులో రాహుల్, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశాలున్నాయి. రిజర్వ్ ఓపెనర్గా సాయి సుదర్శన్ను ఎంపిక చేయడం ఖాయమే అనొచ్చు.
అదనపు స్పెషలిస్ట్ బ్యాటర్ స్థానం కోసం కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, శ్రేయస్ అయ్యర్ల మధ్య పోటీ ఉంది. ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఇద్దరు స్పిన్నర్లే అవసరం అయితే జడేజాతో పాటు సుందర్కు మొగ్గు ఉంది. రిజర్వ్ కీపర్గా ధ్రువ్ జురెల్ కొనసాగే అవకాశం ఉంది. పేస్ విభాగంలో బుమ్రా నాయకత్వంలో అనుభవానికి కొదవ లేదు.
అయితే, ఐదు మ్యాచ్ల సుదీర్ఘ సిరీస్ను బుమ్రా పూర్తి ఫిట్నెస్తో ఆడగలడా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరో సీనియర్ మహ్మద్ షమీ ఫిట్నెస్పై కూడా ఆందోళనలు ఉన్నాయి. సిరాజ్ మూడో పేసర్గా జట్టులో స్థానం దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ సెలెక్టర్లు ఐదుగురు ఫాస్ట్ బౌలర్లను ఎంపిక చేయాలని భావిస్తే ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్ దీప్ సింగ్ కూడా రేసులో ఉన్నారు.