- ఆదుకున్న అక్షర్, అశ్విన్, కోహ్లీ
- ఐదు వికెట్లతో దెబ్బకొట్టిన లైయన్
- ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 61/1
న్యూఢిల్లీ: ఇండియా, ఆస్ట్రేలియా రెండో టెస్టు రసవత్తరంగా నడుస్తోంది. ఇరు జట్లూ నువ్వానేనా అన్నట్టు పోరాడుతున్నాయి. రెండో రోజు ఆసీస్ కాస్త మెరుగైన స్థితిలో నిలిచినా మూడో రోజు మ్యాచ్ ఎవరివైపు తిరుగుందనేది ఆసక్తికరంగా మారింది. శనివారం, రెండో రోజు బ్యాటింగ్లో తడబడిన ఇండియా పడుతూ లేస్తూ ముందుకు సాగింది. ఆసీస్ స్పిన్నర్ నేథన్ లైయన్ (5/67) ఐదు వికెట్లతో టాప్, మిడిలార్డర్ను దెబ్బకొట్టగా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అక్షర్ పటేల్ (115 బాల్స్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 74), ఆర్. అశ్విన్ (71 బాల్స్లో 5 ఫోర్లతో 37) ఎనిమిదో వికెట్కు 114 రన్స్ జోడించి అద్భుతంగా పోరాడారు. దాంతో, ఓదశలో 139/7తో నిలిచిన ఇండియా తొలి ఇన్నింగ్స్లో 262 వద్ద ఆలౌటైంది. ఆసీస్ కంటే ఒక్క పరుగు తక్కువ చేసింది. విరాట్ కోహ్లీ (44) కూడా రాణించాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 12 ఓవర్లలో 61/1తో నిలిచింది. ఓవరాల్గా 62 రన్స్ ఆధిక్యంలోఉంది. ఉస్మాన్ ఖవాజ (6)ను జడేజా (1/23) ఎల్బీ చేసినా.. ట్రావిస్ హెడ్ (39 బ్యాటింగ్), లబుషేన్ (16 బ్యాటింగ్) స్పీడ్గా బ్యాటింగ్ చేసి రోజు ముగించారు. ఈ వికెట్పై నాలుగో ఇన్నింగ్స్ మరింత కష్టతరం కానున్న నేపథ్యంలో మూడో రోజు కంగారూ టీమ్ను ఎంత తక్కువ స్కోరుకు ఆలౌట్ చేస్తుందనే దానిపై ఇండియా విజయావకాశాలు ఉంటాయి.
లైయన్ జోరు..
ఓవర్నైట్ స్కోరు 21/0తో ఆట కొనసాగించిన ఇండియా తొలి సెషన్లోనే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి డీలా పడింది. ఆ నాలుగూ నేథన్ లైయన్కే దక్కాయి. పిచ్ నుంచి మంచి టర్న్ రాబట్టిన నేథన్ ఇండియాపై ఒత్తిడి పెంచాడు. తొలి గంటలో మూడు రివ్యూలు కోల్పోయినా.. వికెట్లు పడగొట్టడంలో సక్సెస్ అయ్యాడు. పేలవ ఫామ్ను కొనసాగించిన కేఎల్ రాహుల్ (17) ఓ రివ్యూలో బతికిపోయినా.. లైయన్ టాస్ బాల్కు వికెట్లు ముందు దొరికిపోయాడు. కెప్టెన్ రోహిత్ (32) మంచి స్వీప్ షాట్తో కుదురుకున్నట్టే కనిపించాడు. కానీ, లైయన్ స్ట్రయిట్ బాల్కు లైన్ మిస్సయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక 20 వేల పైచిలుకు ఫ్యాన్స్ చప్పట్ల నడుమ తన వందో టెస్టులో బ్యాటింగ్కు వచ్చిన పుజారా (0) అదే ఓవర్లో డకౌట్ అయి నిరాశ పరిచాడు. లైయన్ ఫ్లైటెడ్ బాల్ను డిఫెండ్ చేయబోయి ఎల్బీగా వెనుదిరిగాడు. దీనికి ఆసీస్ డీఆర్ఎస్ కోరి ఫలితం రాబట్టింది. ఇక గాయం నుంచి కోలుకొని సూర్య కుమార్ ప్లేస్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ (4) ఫెయిలయ్యాడు. లైయన్ బౌలింగ్లో హ్యాండ్స్కోంబ్ పట్టిన చురుకైన క్యాచ్కు పెవిలియన్ చేరడంతో ఇండియా 66/4తో కష్టాల్లో పడ్డది. ఈ టైమ్లో రవీంద్ర జడేజా (26)తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. లంచ్ తర్వాత ఇద్దరూ ధాటిగా ఆడటంతో ఇండియా కోలుకున్నట్టు కనిపించింది. కానీ, క్రీజులో కుదురుకున్న జడ్డూ.. మర్ఫి (2/53) వేసిన ఫుల్, స్లైడింగ్ బాల్కు ఎల్బీ అవడంతో ఐదో వికెట్కు 59 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. ఫిఫ్టీకి చేరువైన కోహ్లీ అంపైర్ వివాదాస్పద నిర్ణయంతో వెనుదిరిగాడు. తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్ (6) ఆకట్టుకోలేకపోయాడు. లైయన్ బౌలింగ్లో స్వీప్ షాట్కు ట్రై చేయగా.. బాల్ అతని గ్లోవ్స్కు తాకి స్లిప్లో స్మిత్ చేతిలో పడింది.
కీలక భాగస్వామ్యం
ఇండియా ఏడో వికెట్ కోల్పోయిన సమయానికి ఆసీస్ 124 రన్స్ ఆధిక్యంలో నిలిచింది. కంగారూ స్పిన్నర్ల జోరు చూస్తుంటే ఆ టీమ్కు మంచి ఆధిక్యం దక్కేలా కనిపించింది. కానీ, ఇండియా స్పిన్ ఆల్రౌండర్లు అక్షర్, అశ్విన్ అద్భుత బ్యాటింగ్తో ప్రత్యర్థి జోరును అడ్డుకున్నారు. ఇద్దరూ బౌలర్లను కౌంటర్ ఎటాక్ చేశారు. ఫ్రంట్ ఫుట్ ఫార్వర్డ్ బదులు మర్ఫి, కునెమన్ (2/72) డెలివరీల పేస్ను ఉపయోగించి రన్స్ రాబట్టారు. ముఖ్యంగా అక్షర్ క్రమం తప్పకుండా బౌండ్రీలు కొట్టాడు. ముగ్గురు స్పిన్నర్ల బౌలింగ్లోనూ సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో కెరీర్లో మూడో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. చివరకు కొత్త బాల్తో అశ్విన్ను ఔట్ చేసిన కమిన్స్ ఈ జోడీని విడదీశాడు. మర్ఫి వేసిన తర్వాతి ఓవర్లో కమిన్స్ పట్టిన సింగిల్ హ్యాండ్ క్యాచ్కు అక్షర్ ఔటవగా.. షమీ (2)ని కునెమన్ బౌల్డ్ చేయడంతో ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది.
తొలి రోజు సిరాజ్ వేసిన బౌన్సర్ హెల్మెట్కు తగిలి ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కంకషన్కు గురయ్యాడు. అతని ప్లేస్లో రెన్షా కంకషన్ సబ్స్టిట్యూట్గా టీమ్లోకి వచ్చాడు.
కోహ్లీ ఔటేనా..
ఈ మ్యాచ్లో కోహ్లీ ఎల్బీ వివాదాస్పదం అయింది. కునెమన్ వేసిన బాల్ ఒకేసారి కోహ్లీ బ్యాట్, ప్యాడ్ను తాకింది. రూల్స్ ప్రకారం ఇలాంటి సమయాల్లో నాటౌట్ ఇవ్వాలి. కానీ,అంపైర్, థర్డ్ అంపైర్ ఎల్బీ ఇచ్చారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలోనూ కోహ్లీ ఇలానే క్రీజు వీడాడు.