లీస్టర్: గాయంతో కేఎల్ రాహుల్ జట్టుకు దూరంగా ఉండటం, కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా పాజిటివ్గా తేలి ఇంగ్లండ్తో టెస్టులో ఆడటం అనుమానంగా మారిన వేళ యంగ్ ఓపెనర్ శుభ్మన్ గిల్ ఎట్టకేలకు గాడిలో పడ్డాడు. లీస్టర్షైర్, టీమిండియా వామప్ మ్యాచ్లో రెండు జట్ల తరఫున బ్యాటింగ్ చేసిన అతను ఫామ్ అందుకున్నాడు. నాలుగో రోజు ఆదివారం లీస్టర్షైర్ రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్గా వచ్చిన గిల్ (77 బాల్స్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 62) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఓవర్నైట్ స్కోరు 364/9 వద్దనే ఇండియా రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి లీస్టర్కు 367 రన్స్ టార్గెట్ ఇచ్చింది. ఛేజింగ్లో లీస్టర్షైర్ మ్యాచ్ ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 66 ఓవర్లలో 219/4 స్కోరు చేసింది. కరోనా నుంచి కోలుకున్న అశ్విన్ (2/31) 11 ఓవర్లు బౌలింగ్ చేశాడు. శార్దూల్ (1/34), జడేజా (1/35) రాణించారు. తొలి ఇన్నింగ్స్ను ఇండియా 248/8 వద్ద డిక్లేర్ చేయగా.. లీస్టర్ 244 స్కోరుకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో గిల్, విహారి ఇరు జట్ల తరఫున మూడు ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేయగా.. బుమ్రా, ప్రసిధ్ కూడా రెండు టీమ్స్ తరఫున బౌలింగ్ చేశారు. ఈ వామప్తో పంత్, కోహ్లీ, శ్రేయస్, జడేజా, శ్రీకర్ భరత్ ఫిఫ్టీలతో టచ్లోకి రాగా.. కీలకమైన పుజారా(0, 22), విహారి (3, 20, 26) పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోవడం కాస్త లోటు.
