
కేప్ టౌన్: ఏళ్లుగా పోరాడుతున్నా.. వరల్డ్కప్ గెలవలేకపోతున్న ఇండియా విమెన్స్ టీమ్ మరోసారి మెగా కప్కు రెడీ అయ్యింది. ఆదివారం జరిగే గ్రూప్–బి తొలి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో అమీతుమీ తేల్చుకోనుంది. స్టార్లతో బరిలోకి దిగుతున్న ఇండియా ఈ మ్యాచ్లో ఫేవరెట్గా కనిపిస్తున్నది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి బలమైన టీమ్స్కు గట్టిపోటీ ఇస్తున్న టీమిండియా.. గత ఐదేళ్ల నుంచి నిలకడగా ఆడుతున్నది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నది. విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలానికి ముందు రోజు ఈ మ్యాచ్ జరుగుతుండటంతో బాగా ఆడాలన్న కోరిక ఇండియా ప్లేయర్లలో పెరిగింది.
అయితే భుజం గాయంతో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, వేలి గాయంతో స్మృతి మంధాన ఇబ్బందిపడుతుండటం ఇండియా శిబిరంలో ఆందోళన కలిగిస్తున్నది. ఈ మ్యాచ్కు మంధాన అందుబాటులో ఉండటంపై సందిగ్ధత నెలకొంది. ఇక, ఇటీవల జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో సౌతాఫ్రికా, వామప్ మ్యాచ్లో ఆసీస్ చేతిలో ఓడటం ఇండియా బ్యాటింగ్ లోపాలను బహిర్గతం చేస్తోంది. అయితే బౌలింగ్లో రేణుకా సింగ్ ఫామ్లో ఉండటం కలిసొచ్చే అంశం.
వెటరన్ శిఖా పాండే గాడిలో పడితే ఇండియాకు తిరుగుండదు. అండర్19 వరల్డ్ కప్ విన్నర్లలో షెఫాలీ, రిచా ఘోష్ ఈ మ్యాచ్లో కీలకం కానున్నారు. పాకిస్తాన్ టీమ్లో నిడా డర్పై భారీ ఆశలున్నాయి. వామప్ మ్యాచ్లో బంగ్లాపై గెలవడం వాళ్లకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం.