
న్యూఢిల్లీ: ‘ఆ రోజు బోర్డర్కు దగ్గర్లోని టెర్రరిస్టు స్థావరాలే మా టార్గెట్.. పాక్ సైన్యంపై దాడులు చేయాలని అనుకుంటే బ్రహ్మోస్ మిస్సైల్స్ వాడే వాళ్లం’ అని రిటైర్డ్ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా చెప్పారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తొలిసారిగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చండీగఢ్లో జరిగిన మిలిటరీ లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొన్న ధనోవా.. బాలాకోట్ దాడి సంగతులను చెప్పుకొచ్చారు. పాక్ సైన్యంపై దాడులు చేయాలని తాము అనుకోలేదన్నారు.టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసిన మరుసటి రోజు రాజౌరీ, పూంచ్ సెక్టార్లలోని మన సైనిక స్థావరాలపై పాక్ ఆర్మీ దాడులకు ప్రయత్నించిందని గుర్తుచేశారు. తన సైనిక సామర్థ్యానికి ఆ దాడులు ఓ ఉదాహరణగా పాక్ ప్రభుత్వం చెప్పుకుంటోందన్నారు. అయితే, ఆ దాడులు ఫెయిల్ కావడం పాక్కు మేలు చేసిందన్నారు. ఆ దాడుల్లో ఏ ఒక్కటి సక్సెస్ అయినా పాక్ ఆర్మీపై మిస్సైల్వర్షం కురిపించేందుకు తాము రెడీగా ఉన్నామన్నారు. దాంతో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలయ్యేదని ధనోవా వివరించారు. జైషే క్యాంపులపై జరిగిన దాడిలో ఎయిర్ఫోర్స్ టార్గెట్ గురితప్పిందంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలపై ధనోవా స్పందిస్తూ ఎయిర్ ఫోర్స్ను వెనకేసుకువచ్చారు. బాలాకోట్ దాడులు అత్యంత పకడ్బందీగా చేశామని, ముందు అనుకున్నట్లే క్యాంపులను తుడిచిపెట్టేశామని చెప్పారు.