సౌతాఫ్రికాతో శనివారం (డిసెంబర్ 6) జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. విశాఖపట్నం వేదికగా డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ముగిసిన ఈ మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో సఫారీలను చిత్తు చేసి సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్నారు. మొదట బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ విజృంభించడంతో పాటు ఆ తర్వాత బ్యాటింగ్ లో ఓపెనర్ జైశ్వాల్(116) సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్ లో ఇండియా 39.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 271 పరుగులు చేసి విజయం సాధించింది.
271 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, రోహిత్ శర్మ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్ కు ఇద్దరూ 25.5 ఓవర్లలోనే 155 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశారు. ఆరంభంలో జైశ్వాల్ ఆచితూచి ఆడితే మరో ఎండ్ లో రోహిత్ బ్యాట్ ఝులిపించారు. ఈ క్రమంలో మొదట రోహిత్.. ఆ తర్వాత జైశ్వాల్ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఎట్టకేలకు ఈ జోడీని కేశవ్ మహారాజ్ విడగొట్టాడు. 75 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వేగంగా ఆడే క్రమంలో రోహిత్ ఔటయ్యాడు.
రోహిత్ ఔటైన తర్వాత కోహ్లీ, జైశ్వాల్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించడంతో ఇద్దరూ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో జైశ్వాల్ తన కెరీర్ లో తొలి సెంచరీ చేశాడు. మరో ఎండ్ లో కోహ్లీ ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు. జైశ్వాల్ సెంచరీ తర్వాత కోహ్లీ, జైశ్వాల్ శరవేగంగా ఆడుతూ మ్యాచ్ ను ఫినిష్ చేశారు. సిరీస్ లో తొలి వన్డేల్లో సెంచరీలతో చెలరేగిన కోహ్లీ.. మూడో వన్డేలో అజేయంగా 65 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మహరాజ్ కు ఏకైక వికెట్ దక్కింది.
కుల్దీప్, ప్రసిద్ సూపర్ బౌలింగ్:
అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డి కాక్ (106) సెంచరీతో సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బవుమా 48 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలో నాలుగు వికెట్లు పడగొట్టారు. జడేజా, అర్షదీప్ సింగ్ తలో వికెట్ తీసుకున్నారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాకు తొలి ఓవర్లోనే ఆర్షేదీప్ సింగ్ బిగ్ షాక్ ఇచ్చాడు. ఓపెనర్ రికెల్ టన్ ఔట్ చేసి టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. ఆరంభంలోనే రికెల్ టన్ వికెట్ కోల్పోవడంతో కెప్టెన్ బవుమా, వికెట్ కీపర్ డికాక్ ఆచితూచి ఆడారు. ఆ తర్వాత క్రమంగా వీరిద్దరూ బ్యాట్ ఝుళిపించాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో వికెట్ కు కెప్టెన్ బవుమా, డికాక్ కలిసి 113 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని జడేజా విడగొట్టి ఇండియాకు రెండో వికెట్ అందించాడు.
మాథ్యూ బ్రీట్జ్కేతో కలిసి డికాక్ మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డికాక్.. హాఫ్ సెంచరీ తరువాత దూకుడు పెంచాడు. 30 ఓవర్లో హర్షిత్ రాణా బౌలింగ్ లో సిక్సర్ కొట్టి 80 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. బ్రీట్జ్కే వికెట్ ప్రసిద్ కృష్ణ పడగొట్టడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ గాడి తప్పింది. ఆతర్వాత వెంటనే ఒక అద్భుత యార్కర్ తో డికాక్ ను బౌల్డ్ చేశాడు. వేగంగా ఆడే క్రమంలో వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ వచ్చింది. బ్రేవీస్ (29), జాన్సెన్ (17), కార్బిన్ బాష్ (9) స్వల్ప వ్యవధిలో ఔటవ్వడంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేయలేక 270 పరుగులకు ఆలౌటైంది.
#INDvsSAODI 🏏||
— All India Radio News (@airnewsalerts) December 6, 2025
𝑰𝒏𝒅𝒊𝒂 𝒃𝒆𝒂𝒕 𝑺𝒐𝒖𝒕𝒉 𝑨𝒇𝒓𝒊𝒄𝒂 𝒃𝒚 9 𝒘𝒊𝒄𝒌𝒆𝒕𝒔 𝒊𝒏 3𝒓𝒅 𝒂𝒏𝒅 𝒇𝒊𝒏𝒂𝒍 𝑶𝑫𝑰; 𝑪𝒍𝒊𝒏𝒄𝒉 𝒕𝒉𝒆 𝒔𝒆𝒓𝒊𝒆𝒔 2-1.
𝐵𝑟𝑖𝑒𝑓 𝑆𝑐𝑜𝑟𝑒:
𝗦𝗔 🇿🇦: 𝟮𝟳𝟬/𝟭𝟬 (𝟰𝟳.𝟱 𝗢𝘃𝗲𝗿𝘀)
𝑸𝒖𝒊𝒏𝒕𝒐𝒏 𝒅𝒆 𝑲𝒐𝒄𝒌: 106 runs
𝐈𝐍𝐃🇮🇳:… pic.twitter.com/FaeOEn6SjM
