
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 25 ఎయిర్పోర్టులను తాత్కాలికంగా మూసివేసింది. ఈ ఎయిర్పోర్టుల నుంచి ఈ నెల 10 ఉదయం 5:30 గంటల వరకు విమానాల రాకపోకలను నిలిపివేయాలని ఆదేశించింది. వీటిలో జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్, లేహ్, జమ్మూ, పంజాబ్లోని అమృత్సర్, పఠాన్కోట్, భటిండా, రాజస్థాన్లోని జోధ్పూర్, జైసల్మేర్, బికనీర్, కిషన్గఢ్, గుజరాత్లోని భుజ్, జామ్నగర్, రాజ్కోట్, పోర్బందర్, కాండ్లా, హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాల, షిమ్లాతో పాటు చండీగఢ్ ఎయిర్పోర్టులు ఉన్నాయి.
కేంద్రం ఆదేశాల నేపథ్యంలో ఈ ఎయిర్పోర్టుల నుంచి విమానాల రాకపోకలను ఎయిర్లైన్ కంపెనీలు రద్దు చేశాయి. దాదాపు 300కు పైగా విమానాలు రద్దయ్యాయి. తాత్కాలికంగా మూసివేసిన ఎయిర్పోర్టుల మధ్య ఈ నెల 10 ఉదయం 5:30 గంటల వరకు షెడ్యూల్ చేసిన విమానాలను ఎయిర్స్పేస్ ఆంక్షల కారణంగా రద్దు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఆకాశ ఎయిర్ ప్రకటించాయి.