
ఢిల్లీ: అమెరికా నుంచి అపాచీ హెలికాప్టర్లు వచ్చేశాయి. మొదటి విడతలో భాగంగా మూడు అపాచీ ఏహెచ్64ఈ హెలికాప్టర్లు ఢిల్లీకి దగ్గర్లోని హిండన్ ఎయిర్బేస్కు చేరుకున్నాయి. ఇవి మంగళవారం అమెరికా కార్గో విమానంలో ఇండియాకు వచ్చాయి. వీటిని హిండన్ ఎయిర్బేస్లో అసెంబుల్ చేసి పరీక్షించనున్నారు. ఆ తర్వాత ఎయిర్ఫోర్స్కు అప్పగించనున్నారు.
అనంతరం హెలికాప్టర్లను జోధ్పూర్ ఎయిర్బేస్కు తీసుకెళతారు. అపాచీ హెలికాప్టర్ల రాకపై ఆర్మీ స్పందిస్తూ.. ఇదొక మైలురాయి అని పేర్కొంది. వీటి రాకతో ఆర్మీ మరింత బలోపేతమవుతుందని చెప్పింది. ఈ హెలికాప్టర్ల కోసమే ఆర్మీ ఏవియేషన్ కోర్ 2024 మార్చిలో రాజస్థాన్లోని జోధ్పూర్లో తన మొదటి అపాచీ స్క్వాడ్రన్ను ఏర్పాటు చేసింది. పైలట్లు, గ్రౌండ్ సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చింది. ఈ అపాచీ విమానాలు సైన్యంలో చేరితే.. పశ్చిమ సరిహద్దుల్లో మన యుద్ధ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అపాచీ హెలికాప్టర్లలో అత్యాధునిక కమ్యూనికేషన్, నావిగేషన్, సెన్సార్ ఉంటాయి. రాత్రి పూటైనా సరే టార్గెట్లను కచ్చితంగా గుర్తించి దాడి చేయగల డిఫెన్స్ సిస్టమ్ ఈ హెలికాప్టర్ల ప్రత్యేకత.