భారత క్రికెట్‌లో కలవరం.. లవర్ డ్రగ్స్ తీసుకుంటున్న వీడియో లీక్ చేసిన క్రికెటర్

భారత క్రికెట్‌లో కలవరం.. లవర్ డ్రగ్స్ తీసుకుంటున్న వీడియో లీక్ చేసిన క్రికెటర్

భారత యువ క్రికెటర్ కేసీ కరియప్ప.. తన మాజీ ప్రియురాలి వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. రెండ్రోజుల క్రితం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కరియప్ప, తాజాగా ఆమె డ్రగ్స్ తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియా వేదికగా లీక్ చేశాడు. దీనిపై కర్ణాటక పోలీసులు విచారణ ప్రారంభించారు. 

కరియప్ప మాజీ ప్రియురాలు డ్రగ్స్ సేవిస్తున్న వీడియోపై నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద వివరణ ఇస్తూ.. డ్రగ్స్ సేవిస్తూ ఇద్దరు ఒకరినొకరు దూషించుకున్నారని, ఆమె డ్రగ్స్ సేవిస్తున్న వీడియోను కెసి కరియప్పనే బయటపెట్టారన్నారు. ఇరువురి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య డ్రగ్స్ వినియోగం అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని తెలిపారు. వీరిద్దరిపై వేరువేరుగా ఆర్‌టి నగర్‌, బాగల్‌గుంటె పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేశారు. విచారణకు హాజరై తగిన ఆధారాలు సమర్పించాలని ఆర్టీ నగర్ పోలీసులు కరియప్ప ప్రియురాలిగా చెప్పడబడుతున్న యువతికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. 

నన్ను మీరే కాపాడాలి..! 

రెండ్రోజుల క్రితం కరియప్ప.. క్రికెట్ కెరీర్‌ను ముగించేస్తానని తన మాజీ ప్రియురాలు బెదిరిస్తోందని ఆరోపించాడు. అంతేకాదు తన తండ్రి, తల్లి మరియు అన్నయ్య సహా కుటుంబసభ్యుల అందరినీ హంతమొందిస్తానని హెచ్చరించిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఏంటి వీరి గొడవ..?

కర్ణాటక దేశవాళీ క్రికెటర్ అయిన కేసీ కరియప్ప, దివ్య అనే యువతి ప్రేమలో పడ్డాడు. కొన్నాళ్లు సజావుగా సాగిన వీరి బంధంలో విభేదాలు తలెత్తడంతో విడిపోయారు. ఇది జరిగిన కొన్నాళ్ల అనంతరం డిసెంబర్ 31, 2022న సదరు యువతి కరియప్పపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో తనను లోబరుచుకుని గర్భవతిని చేసి.. తనకు అబార్షన్‌ చేయించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే, అందుకు తగ్గ సాక్ష్యాలను ఆమె పోలీసులకు అందించకపోవడంతో ఆ కేసు అలా మిన్నకుండిపోయింది. 

ఇది జరిగి దాదాపు ఏడాది అనంతరం ఇప్పుడు కరియప్ప తన ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. "నాగసంద్రలోని రామయ్య లేఅవుట్‌లో నివాసం ఉంటున్న కేసీ కరియప్ప అనే తనకు దివ్య(24) అనే యువతితో స్నేహం ఉండేదని, అయితే ఆమె చెడు అలవాట్ల కారణంగా తనతో బంధాన్ని తెంచుకున్నానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమె డ్రగ్స్‌, మద్యానికి బానిసని ఆరోపించాడు. తనను ఆ అలవాట్లను మానివేయమని ఒప్పించేందుకు ప్రయత్నించానని, తన మాట వినకపోవడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అప్పటినుంచి తనకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించాడు. ఆ బంధాన్ని పావుగా వాడుకొని తమ ప్రియురాలు తనను వేధిస్తోందని పోలీసుల ముందు వాపోయాడు. తన క్రికెట్ కెరీర్‌ను అంతం చేస్తానని బెదిరిస్తోందని, తన నుంచి మీరే కాపాడాలంటూ కరియప్ప పోలీసులను వేడుకున్నాడు. 

ఎవరీ కరియప్ప..?

కొంగండ చరమన్న కరియప్ప అలియాస్ కేసీ కరియప్ప స్వస్థలం కర్ణాటకలోని కూర్గ్‌. ఇతడు లెగ్‌స్పిన్నర్. లెగ్ బ్రేక్, స్టాక్ బాల్, గూగ్లీ మరియు క్యారమ్ బాల్ వంటి అన్ని రకాల బంతులు వేయగలడు. దేశవాళీ క్రికెట్‌లో మంచిగా రాణించినవాడే. చెప్పుకోదగ్గ ప్లేయరే. మిస్టరీ బౌలర్‌గా పేరొందిన కరియప్ప ఐపీఎల్‌‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. 2015 సీజన్‌లో కేకేఆర్ అతని కోసం ఏకంగా 2.4 కోట్లు వెచ్చించటం గమనార్హం. తాజాగా ముగిసిన ఐపీఎల్‌ మినీ వేలంలో కరియప్ప అన్‌సోల్డ్‌ ఆటగాడగా మిగిలిపోయాడు. సదరు యువతి డ్రగ్స్ తీసుకుంటున్న విషయం కరియప్పకు ముందే తెలిసినా ఇన్నాళ్లు ఎందుకు మౌనం వహించాడనేది తెరమీదకొస్తున్న మరో అంశం. అతనికి డ్రగ్స్ అలవాటు ఉందా..! అనేది కూడా చర్చకు వస్తోంది. ఈ సంఘటనలతో భారత క్రికెట్‌లో ఒక్కసారిగా కలవరం మొదలైంది.