వీడియో: నయాగర జలపాతంలో తొలిసారి మెరిసిన మువ్వన్నెల జెండా

వీడియో: నయాగర జలపాతంలో తొలిసారి మెరిసిన మువ్వన్నెల జెండా

నయాగర జలపాతంలో తొలిసారిగా భారత మువ్వన్నెల జెండా మెరిసింది. ప్రపంచంలోనే ఎత్తైన జలపాతంగా పేరొందిన నయాగర జలపాతంలో ఈ దృశ్యం అబ్బురపరిచింది. 74వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారత త్రివర్ణ పతాకానికి మరో గౌరవం దక్కింది. బుర్జ్‌ ఖలీఫా, నయాగర జలపాతంలో జాతీయ జెండాను ప్రదర్శించారు. అదేవిధంగా న్యూయార్క్‌ టైం స్కేర్‌లో మన జాతీయ జెండాను ఎగురవేశారు.

74వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని కెనడాలోని నయాగర జలపాతం వద్ద శనివారం తొలిసారిగా ప్రదర్శించారు. మన జాతీయపతాకానికి చెందిన మూడు రంగులు నయాగర జలపాతంలో ప్రతిబింబించేలా లైటింగ్ ను ఏర్పాటు చేశారు. భారత కాలమానం ప్రకారం.. జెండాను ఆగస్టు 15 సాయంత్రం ఎగురవేశారు. కెనడా టైం ప్రకారం ఉదయం 10 గంటలకు ఎగురవేశారు. ఇండో-కెనడా ఆర్ట్స్ కౌన్సిల్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో టొరంటోలోని భారత కాన్సుల్ జనరల్ అపూర్వ శ్రీవాస్తవ పాల్గొన్నారు. టొరంటో సిటీ హాల్‌లోనూ జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఇండో కెనడియన్‌ కమ్యూనిటీ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అదేవిధంగా దుబాయ్ లో కూడా మన జాతీయ జెండాకు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనంగా పేరొందిన బుర్జ్ ఖలీఫాను శనివారం రాత్రి భారతీయ త్రివర్ణ పతాక రంగులు వచ్చే విధంగా ఎల్‌ఈడీ లైట్లతో అలంకరించారు. ఈ లేజర్‌ షో ప్రవాస భారతీయులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక తొలిసారిగా న్యూయార్క్‌ టైం స్కేర్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. భారత కాన్సులేట్‌ జనరల్‌ రణధీర్‌ జైస్వాల్‌ జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు.