ఆస్కార్ లో భారతీయం.!

ఆస్కార్ లో భారతీయం.!

ఆస్కార్ అవార్డ్  గెలవడమనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీమా వాళ్లకు ఓ కల. ఒక్కసారైనా ఆస్కార్ అవార్డ్ గెలవాలన్న కోరిక ఉంటుంది. ఆస్కార్ కోసం పోటీపడుతుంటాయి. ఒక్కసారి ఆస్కార్ అవార్డ్ గెలిస్తే చాలు జీవితం ధన్యమై పోయిందనుకుంటారు. అలాంటి అవార్డ్  కోసం మన ఇండియన్ సినిమాలు  పోటీపడుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం నామినేషన్‌లలోకి వెళ్తోన్న చిత్రాల దగ్గర నుంచి ఆస్కార్ అవార్డులపై చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ సారి జరిగే 93వ అకాడమీ అవార్డ్స్‌ లైవ్‌ ప్రత్యేకంగా స్టార్‌ మూవీస్‌, స్టార్‌ వరల్డ్‌ ఛానెల్స్‌లో 26 ఏప్రిల్‌ 2021న  ఉదయం 5.30 గంటలకు జరుగనుంది. ఇదే కార్యక్రమాన్ని అదే రోజు రాత్రి 8.30 గంటలకు పునః ప్రసారం కూడా చేయనున్నారు. మరి ఇప్పటి వరకు ఆస్కార్ లో మెరిసిన మన భారతీయ సినిమాలను ఒక్కసారి చూద్దాం..

ఆస్కార్‌లో భారతీయ చారిత్రాత్మక క్షణాలు..

  •  ఆస్కార్‌లో భారతీయ చిత్ర ప్రవేశం 1958లో జరిగింది. మదర్‌ ఇండియా చిత్రం ఉత్తమ అంతర్జాతీయ చిత్రంలో పోటీపడింది.  అయితే ఒకే ఒక్క ఓటు తేడాతో ఇటాలియన్‌ చిత్రం నైట్స్‌ ఆఫ్‌ కబ్రినాకు అవార్డును కోల్పోయింది
  • ఆస్కార్‌ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయులు అనగానే చాలామంది రకరకాలుగా చెప్తారు కానీ 1983లో ఓ కాస్ట్యూమ్‌ డిజైనర్‌కు ఆస్కార్‌ లభించిందంటే ఆశ్చర్యం కలుగక మానదు. గాంధీ చిత్రానికి గానూ  భాను అథైయా గోల్డెన్‌ ట్రోఫీ అందుకున్నారు. ఇదే చిత్రానికి రవిశంకర్‌ సైతం నామినేట్‌ అయ్యారు.
  • మన దేశానికి ఆస్కార్‌లో లభించిన అరుదైన గౌరవం అంటే మాత్రం సత్యజిత్‌రేకు హానరరీ అకాడమీ అవార్డును 1992లో అందించడమే ! ఈ గౌరవాన్ని అందుకున్న ఒకే ఒక్క భారతీయుడు ఆయన.
  • భారతీయ కథతో రూపుదిద్దుకున్న బ్రిటీష్‌ చిత్రం స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌ 2008లో ఏకంగా 8 అవార్డులు అందుకుంది. ఏఆర్‌ రెహమాన్‌ రెండు అవార్డులు..ఒరిజినల్‌ సాంగ్‌, ఒరిజినల్‌ స్కోర్‌ అవార్డులు అందుకున్నారు. ఒకటి కన్నా ఎక్కువ అవార్డులు అందుకున్న తొలి భారతీయుడు ఆయన
  • ఇండియా నుంచి ఉత్తమ అంతర్జాతీయ చిత్ర విభాగాలలో నామినేషన్లు పొందిన చిత్రాలుగా మదర్‌ ఇండియా, లగాన్‌, సలామ్‌ బాంబే మాత్రమే నిలిచాయి.
  • ఈ సంవత్సరం వైట్‌ టైగర్‌ చిత్రానికి బెస్ట్‌ అడాప్టెడ్‌ స్ర్కీన్‌ప్లే విభాగంలో నామినేట్ అయ్యింది. ప్రియాంక చోప్రా, రాజ్‌కుమార్‌ రావు, ఆదర్శ్‌ గౌరవ్‌ లు దీనిలో నటించారు.