కెనడాలోని ఒంటారియోలో నివాసం ఉంటున్న సిమ్రాన్ జిత్ షల్లీ సింగ్(40) అనే భారతీయుడికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అతను మానవ అక్రమ రవాణాకు పాల్పడినట్టు తేలడంతో.. అల్బనీలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 250,000 డాలర్ల (ఇండియన్ కరెన్సీలో 2 కోట్ల 6 లక్షలు) జరిమానా విధించింది. సింగ్ మొదటగా ఆరుగురిని, ఆ తర్వాత మరో ముగ్గురిని కెనడా నుంచి అమెరికాకు అక్రమ రవాణా చేసినట్టుగా నేరాన్ని అంగీకరించాడు. యూఎస్ అభ్యర్ధన మేరకు.. 2022 జూన్ 28వ తేదీన సింగ్ను కెనడాలో అరెస్టు చేశారు.
ఈ కేసు విచారణలో భాగంగా 2023 మార్చి 30న సింగ్ని కెనడా నుంచి అమెరికాకు రప్పించారు. 2020 మార్చి, 2021 మార్చి మధ్యలో అతను కొంతమంది భారతీయులను కార్న్వాల్ ద్వీపం, సెయింట్ లారెన్స్ నదీ ప్రాంతంలోని అక్వెసన్సే భారత రిజర్వ్ మీదుగా.. కెనడా నుండి అమెరికాకు అక్రమంగా రవాణా చేసినట్టు విచారణలో తేలింది. సెయింట్ లారెన్స్ నదిలో పడవల ద్వారా మనుషుల్ని అమెరికాకు తరలించే వాడని పోలీసులు తెలిపారు. గతంలో ఇదే నదిలో నలుగురు భారతీయులు, నలుగురు రోమానియన్ల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అప్పుడే ఈ మార్గం గుండా మనుషుల్ని అక్రమంగా రవాణా చేస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది.
కెనడా నుంచి యూఎస్కి తమ ప్రవేశాన్ని సులభతరం చేసినందుకు గాను సింగ్ తమ వద్ద నుంచి 5వేల నుంచి 35వేల డాలర్ల వరకు వసూలు చేశాడని.. అమెరికన్ లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కొంతమంది అక్రమ వలసదారులు సమర్పించిన డాక్యుమెంట్లలో తేలింది. ఈ నేరారోపణలన్నిటిలో సింగ్ దోషిగా తేలడంతో.. కోర్టు అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్ష 15 ఏళ్ల వరకూ పొడిగించే ఆవకాశముందని కూడా కోర్టు పేర్కొంది. సింగ్ జైలు శిక్ష 2023 డిసెంబర్ 28 నుండి అమల్లోకి వస్తుందని తీర్పునిచ్చారు
