న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) రూ. 148 కోట్లకు మెర్కటర్ పెట్రోలియం (ఎంపీఎల్) ను దక్కించుకుంది. ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ను ఎదుర్కొంటున్న ఈ కంపెనీని కొనుగోలు చేశామని రెగ్యులేటరీ ఫైలింగ్లో ఐఓసీ పేర్కొంది. ‘మెర్కటర్ పెట్రోలియంలో 100 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఐఓసీ సబ్మిట్ చేసిన రిజల్యూషన్ ప్లాన్కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై ఆమోదం తెలిపింది’ అని కంపెనీ వెల్లడించింది.
ఎంపీఎల్కు గుజరాత్లోని కాంబే బేసిన్లో ఓ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లొరేషన్ బ్లాక్ ఉంది. ఇదొక ఆన్లాండ్ (సముద్రంలో కాకుండా నేలపైన) ఆయిల్ బ్లాక్. ఎంపీఎల్ ఈ బ్లాక్ను 2008 లో ప్రభుత్వం నుంచి దక్కించుకుంది.
ఇంకా 4.55 కోట్ల బ్యారెల్స్ ఆయిల్ రిజర్వ్లు ఈ బేసిన్లో ఉన్నాయని అంచనా. ఐఓసీకి చెందిన కొయాలి రిఫైనరీ ఈ ఆయిల్ బ్లాక్కు 60 కి.మీ దూరంలో ఉంది. 2019 నుంచి ఈ బ్లాక్ నుంచి ఐఓసీ ఆయిల్ కొంటోంది కూడా. రిజల్యూషన్ ప్లాన్ ప్రకారం రూ. 135 కోట్లను ఎంపీఎల్ క్రెడిటార్లకు ఐఓసీ చెల్లిస్తుంది. అన్సెక్యూర్డ్ లోన్లు ఇచ్చిన ఫైనాన్షియర్లకు ఎటువంటి పేమెంట్ అందదు.