
ముంబై: ఫ్యాన్స్కు కిక్ ఇస్తూ.. వరల్డ్ క్రికెట్ గతిని మార్చేసిన ఐపీఎల్ వెయ్యి మ్యాచ్ల మైలురాయికి చేరింది. ఈ హిస్టారికల్ మ్యాచ్ను ముంబై ఇండియన్స్ మరింత స్పెషల్గా మార్చుకుంది. రాజస్తాన్ రాయల్స్ ఇచ్చిన భారీ టార్గెట్ను ఛేజ్ చేసి థ్రిల్లింగ్ విక్టరీ సాధించి తమ కెప్టెన్ రోహిత్ శర్మకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. వాంఖడేలో ఆదివారం రాత్రి జరిగిన ఈ పోరులో యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (62 బాల్స్లో 16 ఫోర్లు, 8 సిక్సర్లతో 124) సెంచరీతో చెలరేగినా రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో ఓడింది. టాస్ నెగ్గిన రాజస్తాన్ తొలుత 20 ఓవర్లలో 212/7 స్కోరు చేసింది. ముంబై బౌలర్లలో అర్షద్ ఖాన్ మూడు, పీయుష్ చావ్లా రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్లో సూర్యకుమార్ (29 బాల్స్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 55), టిమ్ డేవిడ్ (14 బాల్స్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 45 నాటౌట్) చెలరేగడంతో ముంబై 19.3 ఓవర్లలో 214/4 స్కోరు చేసి గెలిచింది. గ్రీన్ (44), తిలక్ వర్మ (29 నాటౌట్) కూడా రాణించారు. యశస్వికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
జైస్వాల్ తుఫాన్
రాజస్తాన్ ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ ఆటే హైలైట్. వరుసగా వికెట్లు పడుతున్నా ఒక్కడే తుఫాన్ ఇన్నింగ్స్తో చెలరేగి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఇన్నింగ్స్ నాలుగో బాల్నే సిక్స్గా మార్చి తన ఉద్దేశం ఏంటో చెప్పిన యశస్వి ఎక్కడా తగ్గలేదు. రెండో ఓవర్లో ఆర్చర్కు సిక్సర్తో వెల్కం చెప్పిన అతను మెరిడిత్కు నాలుగు బౌండ్రీలతో స్వాగతం పలికాడు. స్లోగా ఆడిన బట్లర్ (18), పడిక్కల్ (2), కెప్టెన్ శాంసన్ (14), హోల్డర్ (11), హెట్మయర్ (8) ఫెయిలైనా జైస్వాల్ జోరు కొనసాగించాడు. 32 బాల్స్లోనే ఫిఫ్టీ దాటిన అతను తర్వాత మరింత రెచ్చిపోయాడు. మెరిడిత్ వేసిన 18వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో లీగ్లో ఫస్ట్ సెంచరీ (53 బాల్స్) పూర్తి చేశాడు. తర్వాతి ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టిన జైస్వాల్ లాస్ట్ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టి ఔటయ్యాడు.
ముంబై జోర్దార్
భారీ టార్గెట్ ఛేజింగ్లో రెండో ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ (3)ను ఔట్ చేసి సందీప్ శర్మ ముంబైకి షాకిచ్చినా.. గ్రీన్, ఇషాన్ (28) రెండో వికెట్కు 62 రన్స్ జోడించి మంచి పునాది వేశారు. అశ్విన్తన వరుస ఓవర్లో వీరిద్దరినీ ఔట్ చేసినా సూర్యకుమార్ సునామీలా విరుచుకుపడ్డాడు. కుల్దీప్ సేన్ వేసిన 13వ ఓవర్లో 6, 4, 4, 4తో 20 రన్స్ కొట్టి ముంబై రేసులోకి తెచ్చాడు. ఫిఫ్టీ పూర్తి చేసుకున్న అతను సందీప్ పట్టిన సూపర్ క్యాచ్కు ఔటైనా.. తిలక్తో కలిసి డేవిడ్ భారీ షాట్లతో దంచికొట్టాడు. 19వ ఓవర్లో 6,4 బాది రాయల్స్పై నీళ్లు చల్లాడు. హోల్డర్ వేసిన లాస్ట్ ఓవర్లో 17 రన్స్ అవసరం అవగా.. హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టి ముంబైని గెలిపించాడు. అశ్విన్ 2, సందీప్, బౌల్ట్ తలో వికెట్ తీశారు.