మంచి టూరిస్ట్ స్పాట్కు వెళ్లినప్పుడు ఆ విశేషాలను అడిగి తెలుసుకోవచ్చు. అక్కడ ఫొటోలూ దిగొచ్చు. ఆ విశేషాలే ఒక్కోసారి మనకు చిక్కులు తెచ్చిపెట్టొచ్చు. ఆ ప్రాంతాల్లో ఏమేం చేయాలి.. ఏమేం చేయకూడదో తెలుసుకోకుండా వెళితే జైలుకు వెళ్లాల్సి రావొచ్చు. మహారాష్ట్రకు చెందిన అభిజిత్ రతన్ హజారేకి అలాంటి అనుభవమే ఎదురైంది. భూటాన్ నేషనల్ మెమోరియల్ అయిన చోర్టెన్పైకి ఎక్కి ఫొటో దిగినందుకు అతడిని రాయల్ భూటాన్ పోలీసులు (ఆర్బీపీ) అదుపులోకి తీసుకున్నారు. పాస్పోర్టును లాక్కునారు.
ఈ ఘటన శుక్రవారం భూటాన్లోని దౌల్చాలో జరిగింది. బుద్ధుడు సజీవంగా ఉన్నాడని బుద్ధిస్టులు భావించే పవిత్రమైన చోటే ఈ చోర్టెన్. అలాంటి పవిత్రమైన చోర్టెన్పైకి ఎక్కడం అక్కడ నేరం. అందుకే పోలీసులు అభిజిత్ను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యేవరకూ దిగిన హోటల్లోనే ఉండాలని ఆదేశించారు. భూటానీస్ నేతృత్వంలో వెళ్లిన 15 బైకుల కాన్వాయ్లో అభిజిత్ ఓ సభ్యుడు. దౌల్చాలో హాల్ట్ అయినప్పుడు ఇలా చోర్టెన్పైకి ఎక్కాడు. అక్కడే చోర్టెన్కు మరమ్మతులు చేస్తున్న కార్పెంటర్ జాంభే సాయంతో అతడు దానిపైకి ఎక్కి నిలబడి ఫొటోలకు పోజిచ్చాడు. జాంభే కూడా ఫొటో దిగాడు. పరారీలో ఉన్న జాంభే కోసం పోలీసులు వెతుకుతున్నారు.