- నేడు థాయ్లాండ్తో ఇండియా విమెన్స్ టీమ్ గోల్డ్ మెడల్ ఫైట్
షా ఆలమ్ (మలేసియా) : బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్షిప్లో ఇండియా విమెన్స్ టీమ్ తొలిసారి ఫైనల్ చేరుకుంది. మెగా టోర్నీలో తొలి గోల్డ్ మెడల్ గెలిచేందుకు అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో ఇండియా 3–2తో మాజీ చాంపియన్ జపాన్పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. దీంతో 2016, 2020 ఎడిషన్లలో సాధించిన బ్రాంజ్ మెడల్ చరిత్రను తిరగరాయనుంది. తొలి సింగిల్స్లో పీవీ సింధు13–21, 20–22తో అయా ఓహోరీ చేతిలో ఓడటంతో ఇండియా కాస్త నిరాశకు లోనైంది.
అయితే కీలకమైన డబుల్స్ మ్యాచ్లో వరల్డ్ 23వ ర్యాంకర్లు ట్రీసా జాలీ– పుల్లెల గాయత్రి 21–17, 16–21, 22–20తో వరల్డ్ ఆరో ర్యాంకర్లు నమీ మట్సుయమా–చిహారు షిడాని ఓడించి స్కోరును 1–1తో సమం చేశారు. రెండో సింగిల్స్లో అష్మితా చాలిహా 21–17, 21–14తో వరల్డ్ మాజీ చాంపియన్ నజోమి ఒకుహరపై గెలిచి లీడ్ను 2–1కి పెంచింది. విమెన్స్ డబుల్స్ రెండో మ్యాచ్లో అశ్విని పొన్నప్ప–సింధు 14–21, 11–21తో రెనా మియురా–అయాకో సుకురమోటో చేతిలో ఓడారు.
దీంతో ఇరుజట్ల స్కోరు 2–2తో సమమైంది. ఈ దశలో 17 ఏండ్ల అన్మోల్ ఖర్బ్ 21–14, 21–18తో నట్సుకి నిడైరాపై గెలిచి ఇండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. నెట్ వద్ద అద్భుతమైన డ్రాప్లు వేసిన అన్మోల్ క్రాస్ కోర్టు ర్యాలీలు, బేస్లైన్ గేమ్తో ఆకట్టుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో ఇండియా.. థాయ్లాండ్తో తలపడుతుంది.