ఒకే ఒక్క ఒరాంగుటాన్​ చనిపోయింది

ఒకే ఒక్క ఒరాంగుటాన్​ చనిపోయింది
  • శ్వాస సంబంధిత వ్యాధితో కన్నుమూత
  • భువనేశ్వర్​ జూలో చనిపోయిన బిన్నీ

భువనేశ్వర్​: ఇండియాలో ఉన్న ఒకే ఒక్క ఒరాంగుటాన్​ చనిపోయింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్​ శివార్లలోని నందన్​ కనన్​ జూలో ఉంటున్న 41 ఏళ్ల బిన్నీ అనే ఒరాంగుటాన్​ శ్వాస సంబంధిత వ్యాధితో బుధవారం రాత్రి కన్నుమూసింది. బిన్నీ మెడ కింది భాగంలో పెద్ద గడ్డ ఉందని, ఆ గడ్డపై ఎప్పుడు అది గోకుతూ ఉండడంతో మానలేదని జూ వెటర్నరీ డాక్టర్​ శరత్​ సాహు చెప్పారు. ఇండియాలో ఒరాంగుటాన్​లు ఉండవని జూ శాంక్చువరీ మేనేజర్​ అలోక్​ దాస్​ చెప్పారు. 2003లో పుణె నుంచి దానిని భువనేశ్వర్​ జూకు తీసుకొచ్చినట్టు తెలిపారు. పుణెకి సింగపూర్​ నుంచి తీసుకొచ్చి ఉంటారని భావిస్తున్నారు.

ఇండొనేసియాలోని బోర్నియో, సుమత్రా దీవుల్లో ఉన్న ఒరాంగుటాన్​లకు పామాయిల్​ పంటలు ప్రాణాంతకంగా మారుతున్నాయని వైల్డ్​లైఫ్​ ట్రస్ట్​ ఆఫ్​ ఇండియా డైరెక్టర్​ డాక్టర్​ ఎన్​వీకే అష్రఫ్​ చెప్పారు. ఆ దేశం వాటి రక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒరాంగుటాన్​లను వేరే ప్రాంతాలకు తరలిస్తే అవి అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా మారే అవకాశం ఉండదని, దాని వల్ల వాటి ప్రాణానికే ప్రమాదం ఉంటుందని, అందుకే ఇండియాలో ఒకే ఒక్క ఒరాంగుటాన్​ ఉందని సీనియర్​ అధికారి ఒకరు చెప్పారు. ప్రపంచంలో బోర్నియన్​, సుమత్రన్​, తపనులి అనే మూడు రకాల ఒరాంగుటాన్​లున్నాయి.