
న్యూఢిల్లీ: భారత సేవల రంగ వృద్ధి ఆగస్టులో 15 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి పెరగడం, డిమాండ్ మెరుగుదల దీనికి కారణమని హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ సర్వే తెలిపింది. ఈ ఏడాది జులైలో సర్వీసెస్ సెక్టార్లో 60.5గా ఉన్న పీఎంఐ ఇండెక్స్, ఆగస్టులో 62.9కి పెరిగింది.
ఇది 2010 జూన్ తర్వాత అత్యధిక స్థాయి. పీఎంఐలో 50కి పైగా స్కోరు వృద్ధిని సూచిస్తే, 50కంటే తక్కువ స్కోరు మందగమనాన్ని సూచిస్తుంది. ఆగస్టులో దేశీయ, అంతర్జాతీయ డిమాండ్ బలంగా ఉండటంతో, కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి 15 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. ఎగుమతి ఆర్డర్లు కూడా పెరిగాయి.
ఆసియా, యూరప్, మిడిల్ ఈస్ట్, యూఎస్ నుంచి డిమాండ్ పెరగడంతో కంపెనీలు ఉద్యోగులను నియమించుకున్నాయి. లేబర్ ఖర్చులు, డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పెరిగాయి. సర్వీసెస్ సెక్టార్లో ద్రవ్యోల్బణం 9 నెలల గరిష్ట స్థాయికి చేరింది. ఉత్పత్తి ధరలు 2012 తర్వాత అత్యధికంగా పెరిగాయి.
పీఎంఐ డేటాను 400 కంపెనీల సర్వే ఆధారంగా ఎస్ అండ్ పీ గ్లోబల్ లెక్కించింది.