చైనా అడ్డంకులకు ఇండియా గట్టి జవాబు.. 6 రసాయన దిగుమతులపై యాంటీ డంపింగ్‌ డ్యూటీ

చైనా అడ్డంకులకు ఇండియా గట్టి జవాబు.. 6 రసాయన దిగుమతులపై యాంటీ డంపింగ్‌ డ్యూటీ
  • ఇజ్రాయెల్‌‌, కెనడా, మొరాకో వంటి దేశాల నుంచి దిగుమతులు పెంచుకోవాలని ప్లాన్‌‌
  • లోకల్‌‌గా తయారీ పెంచేందుకు కంపెనీలకు ప్రోత్సాహకాలు
  • ఎరువుల దిగుమతులపై రిస్ట్రిక్షన్లు పెట్టిన చైనా
  • రేర్ ఎర్త్ మెటల్స్‌‌ సప్లయ్‌‌పైనా అడ్డంకులు

న్యూఢిల్లీ: ఇండియా,  చైనా మధ్య ట్రేడ్ వార్ నడుస్తోంది. భారతదేశానికి ఎగుమతి చేసే రేర్ ఎర్త్ మాగ్నెట్స్‌‌, ఎరువుల సంబంధిత ప్రొడక్ట్‌‌లపై చైనా రిస్ట్రిక్షన్లు పెట్టింది. దీనిని ధీటుగా ఎదుర్కొనేందుకు ఇండియా రెడీ అయ్యింది.  భారత ప్రభుత్వం ఈ దేశం నుంచి చేసుకునే ఆరు కీలక రసాయన దిగుమతులపై యాంటీ -డంపింగ్ సుంకాలు విధించింది. స్పెషాలిటీ ఎరువుల దిగుమతులపై ఒత్తిడి పెంచుతోంది. ప్రస్తుతం చైనాతో ఇండియాకు సుమారు 99.2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.5 లక్షల కోట్ల)  ద్వైపాక్షిక వాణిజ్య లోటు ఉంది. దీనిని తగ్గించుకునే పనిలో మన ప్రభుత్వం ఉంది. 

యాంటీ డంపింగ్ సుంకాలు

చైనా నుంచి చౌకగా వచ్చే రసాయనాలు భారత మార్కెట్‌‌ను ముంచెత్తి స్థానిక పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (డీజీటీఆర్‌‌‌‌) తాజాగా నిర్ధారించింది. దీనిపై వాణిజ్య మంత్రిత్వ శాఖ వేగంగా చర్యలు తీసుకుంది.  కిలోకు 20.87 డాలర్ల నుంచి టన్నుకు 2,000 డాలర్ల వరకు అదనపు సుంకాలు విధించింది. ఈ సుంకాలు తదుపరి ఐదేళ్లు అమలులో ఉంటాయి. ఫెర్టిసైడ్‌‌ హెర్బిసైడ్ ఉత్పత్తికి కీలకమైన పీడీడీఏపై   టన్నుకు 2,017.9 డాలర్ల వరకు (రూ.1.7 లక్షలు) యాంటీ డంపింగ్‌ డ్యూటీని ప్రభుత్వం విధించింది.  

ఆసిటోనిట్రిల్ (ఫార్మా తయారీలో ఉపయోగించే సాల్వెంట్)పై టన్నుకు 481డాలర్ల (రూ.41 వేల) వరకు,  విటమిన్ ఏ పాల్మిటేట్‌పై (న్యూట్రిషనల్ సప్లిమెంట్స్‌‌లో ఉపయోగం)  కిలోకు 20.87డాలర్ల (రూ.1,800) అదనపు సుంకాలను,  చైనా,  జపాన్ నుంచి వచ్చే   ఇన్సాల్యుబుల్ సల్ఫర్‌‌‌‌పై (టైర్ తయారీలో వాడేది) టన్నుకు 358 డాలర్ల (రూ.31 వేల) వరకు సుంకాన్ని వేసింది. మందుల తయారీలో వాడే   పొటాషియం, సోడియం టెర్షియరీ బుటాక్సైడ్‌పై (హై- ఎండ్ డ్రగ్ ఉత్పత్తికి), డెకర్ పేపర్‌‌పై (ఇంటీరియర్స్‌‌లో ఉపయోగం) కూడా సుంకాలు విధించింది. 

ఎరువులకు చైనా ఆటంకం

భారతదేశం సుంకాలతో గట్టిగా స్పందిస్తున్న తరుణంలో, చైనా నుంచి స్పెషాలిటీ ఎరువుల షిప్‌‌మెంట్లలో గత రెండు నెలలుగా వివరణ లేని ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆసక్తికరంగా, ఇవే ఎరువులు ఇతర దేశాలకు సజావుగా సరఫరా అవుతున్నాయి. “ఇది ఆలస్యం కాదు.  ఇది ఒక స్ట్రాటజిక్ ఒత్తిడి” అని ముంబై ఆధారిత అగ్రి -ఇంపోర్ట్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్  ఒకరు  అన్నారు.  ఈ ఎరువులు పండ్లు, కూరగాయల సాగుకు అధిక దిగుబడి కోసం కీలకం. ఈ కొరత కొనసాగితే ఆహార భద్రత, లక్షలాది రైతుల జీవనోపాధికి ముప్పు వాటిల్లవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

దీర్ఘకాలంలో..

సుంకాలు,  ట్రేడ్ బారియర్స్‌‌తో పాటు, భారతదేశం దీర్ఘకాలిక వ్యూహాలపై దృష్టి సారిస్తోంది.  ఎరువులు,  రా మెటీరియల్స్‌‌ను ఇజ్రాయెల్, కెనడా, మొరాకో వంటి ప్రత్యామ్నాయ దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని చూస్తోంది. లోకల్‌‌గా  స్పెషాలిటీ అగ్రి- ఇన్‌‌పుట్స్, ఇండస్ట్రియల్ కెమికల్స్ ఉత్పత్తిని పెంచడానికి స్థానిక తయారీదారులకు ప్రోత్సాహకాలను ప్రకటించింది.  చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా భవిష్యత్తులో ట్రేడ్‌‌ను ఆయుధంగా ఉపయోగించే అవకాశాన్ని చైనాకు ఇవ్వకూడదని నిర్ణయించుకుంది.  ముఖ్యంగా ఆహార భద్రత, కీలకమైన ఇండస్ట్రీలకు సంబంధించిన సప్లయ్‌‌ చెయిన్‌‌లో ఎటువంటి అడ్డంకి ఉండకుండా చూసుకోవాలనేదే లక్ష్యం.

డబ్ల్యూటీఓ రూల్స్‌ అనుగుణంగా ఒత్తిడి

మన ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యలతో కొంత కదలిక కనిపిస్తోంది.  చైనీస్ గూడ్స్‌‌పై మరిన్ని  ఆంక్షలు విధించడం, కొన్ని దిగుమతులను   నిషేధించడం వంటివి భారత్ చేయడం లేదు.  బదులుగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ) ద్వారా ఒత్తిడి పెంచుతోంది. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల ప్రకారం  యాంటీ- డంపింగ్ సుంకాలను విధించడానికి వీలుంది.  అన్యాయమైన పోటీ నుంచి స్థానిక పరిశ్రమలను రక్షించడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు.  మరోవైపు  రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ నుంచి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ వరకు వివిధ ప్రొడక్ట్‌‌ల సప్లయ్ చెయిన్‌‌ను  రాజకీయ ఒత్తిడి కోసం చైనా ఉపయోగిస్తోంది. తాజాగా నెలకొన్న ఎరువుల ఆటంకం ఈ ప్యాటర్న్‌‌లో భాగమే. ఇండియా  గతానికి భిన్నంగా ఈసారి గట్టిగా  స్పందించింది.