అది స్కాట్లాండ్లోని గ్లాస్గో. క్లైమేట్ ఛేంజ్ కాన్ఫరెన్స్ జరుగుతోంది అక్కడ. పర్యావరణ పరిరక్షణ గురించి, దానికోసం తీసుకుంటున్న చర్యల గురించి చర్చించడానికి ప్రపంచ దేశాల లీడర్లు సమావేశమయ్యారు. ఒక్కరొక్కరుగా తమ ఓపినియన్ చెబుతున్నారు. ఇంతలోనే ఒక పదిహేను ఏండ్ల ఇండియన్ స్కూల్ గర్ల్ వేదిక మీదికి వచ్చింది. ‘ఈ రోజు మీ అందరినీ నేను ఒక్కటే కోరుతున్నా. ఇక మాటలు చెప్పడం ఆపండి. చర్యలు తీసుకోండి. మీ ఉత్త హామీలపై మా జనరేషన్ మొత్తం కోపంగా ఉంది. నేను ఇండియన్ గర్ల్ మాత్రమే కాదు. ఈ నేలతల్లి కన్నబిడ్డను’ అని పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చింది. తన స్పీచ్తో అందర్నీ కట్టిపడేసిన ఆ అమ్మాయి పేరు వినీశా ఉమాశంకర్. తమిళనాడుకి చెందిన వినీశ ‘ఎర్త్షాట్ ప్రైజ్–2021’ ఫైనలిస్టుల్లో ఒకరు. ఆమె తయారుచేసిన సోలార్ పవర్తో నడిచే ఇస్త్రీ బండి ‘క్లీన్ ఎయిర్’ కేటగిరీలో ఎర్త్షాట్ ప్రైజ్కి ఎంపికైంది.
కొత్త తరంతోనే మార్పు
‘‘మేము ‘ఎర్త్షాట్ ప్రైజ్ 2021 విన్నర్స్, ఫైనలిస్టులం. మన నేల ఎదుర్కొంటున్న అతి పెద్ద ఛాలెంజెస్కి సొల్యూషన్ చూపిస్తున్నాం. ఇదివరకు ఎవ్వరూ చేయని ఇన్నొవేషన్స్తో ముందుకు వచ్చాం. మేము కంప్లైంట్ చేయాలనుకోవడం లేదు. దానికి బదులుగా మనందర్నీ హెల్దీ, వెల్దీ చేసే ఇన్నొవేషన్స్ చేస్తున్నాం. మేము ఇవన్నీ ఈజీ అని చేయడం లేదు. నిజానికి ఇవి చాలా కష్టమైన పనులు. ఇలాంటి ఛాలెంజెస్ ఇన్నోవేటివ్ జనరేషన్స్ని తయారుచేస్తాయి. వాళ్లు మనందరికోసం ఒక మంచి ప్రపంచాన్ని నిర్మిస్తారు. వాళ్లని చూసి అలాంటి జనరేషన్స్ మరిన్ని వస్తాయి. మీరు పర్యావరణం కోసం తీసుకున్న చర్యలను మేము చూస్తూ ఉండలేం. మీవల్ల కాదంటే చెప్పండి మేమే ముందుండి నడిపిస్తాం. మీరు అక్కడే ఆగిపోయినా కూడా, మేము కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తాం” అని చెప్పడమే కాదు తమ తరంతో కలిసి నడవాల్సిందిగా వరల్డ్ లీడర్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, వ్యాపారవేత్తల్ని రిక్వెస్ట్ చేసింది వినీశ.
