- శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి వైజాగ్, చెన్నై, బెంగుళూరుకు స్లీపర్ బస్సులు
- చర్లపల్లి, సికింద్రాబాద్ నుంచి చెన్నై, ముంబై, కోల్కతాకు ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్/సిటీ, వెలుగు: ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో ఆర్టీసీ, రైల్వే స్పెషల్ సర్వీసులను నడుపుతున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి వైజాగ్, చెన్నై, బెంగుళూరు తదితర సిటీలకు ఆర్టీసీ స్లీపర్ బస్సులను నడుపుతున్నది. చెన్నై, బెంగుళూరుకు వెళ్లే ప్రత్యేక బస్సులను శనివారం మధ్యాహ్నం నుంచే అందుబాటులోకి తెచ్చింది. అలాగే రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ బస్సులను కూడా ప్రారంభించింది.
చెన్నైకి రూ.2,110, బెంగళూరుకు రూ.1,670 చొప్పున చార్జీలను ఖరారు చేసింది. తాము తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులకు కొంతవరకైనా ఉపశమనం కలుగుతుందని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ఇక ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్లను నడుపుతున్నది.
చెన్నై, ముంబై, కోల్కతా (షాలీమార్) రూట్లలో మూడు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. చర్లపల్లి–షాలీమార్ట్రైన్ శనివారం రాత్రి 9:35 గంటలకు బయలుదేరింది. ఇందులో 24 కోచ్లు ఉండగా, 1,656 మంది ప్రయాణికులు తరలివెళ్లారు. అలాగే సికింద్రాబాద్–చెన్నై (ఎగ్మోర్) ట్రైన్ శనివారం సాయంత్రం 6:40 గంటలకు బయలుదేరింది. ఆదివారం ఉదయం 8గంటలకు చెన్నై చేరుకుంటుంది.
ఇందులో 1,508 మంది తరలివెళ్లారు. హైదరాబాద్–ముంబైఎల్టీటీ స్పెషల్ట్రైన్ శనివారం రాత్రి 8:25 గంటలకు బయలుదేరింది. ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు ముంబైచేరుకుంటుంది. కాగా, ఆదివారం మరో రెండు ప్రత్యేక రైళ్లను కోల్కతా, పుణెకు నడుపుతామని సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు.
