
సాంకేతిక లోపం కారణంగా, వాతావరణం అనుకూలించని కారణంగా అప్పుడప్పుడు విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వడం గురించి వింటూ ఉంటాం.. కానీ, పక్షి ఢీకొని విమానాలు ఎనర్జెన్సీ ల్యాండింగ్ అవ్వడం అరుదుగా జరుగుతూ ఉంటుంది.. సోమవారం ( జూన్ 2 ) ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.. 4 వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న ఇండిగో విమానాన్ని రాబందు ఢీకొనడంతో రాంచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..రాంచీ సమీపంలో ఇండిగో విమానాన్ని రాబందు ఢీకొట్టిందని తెలిపారు అధికారులు.
ప్రమాదం జరిగిన సమయంలో విమానం దాదాపు 10 నుండి 12 నాటికల్ మైళ్ల దూరంలో 3 నుండి 4 వేల అడుగుల ఎత్తులో ఉన్నట్లు తెలిపారు అధికారులు. ఇండిగో విమానం పాట్నా నుండి రాంచీకి వస్తుండగా, పైలట్ ఇక్కడ అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని తెలిపారు రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయం డైరెక్టర్ ఆర్ఆర్ మౌర్య.
ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి సేఫ్ గా ల్యాండ్ చేయటంతో ప్రాణనష్టం తప్పిందని.. ప్రయాణీకులందరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు అధికారులు.రాబందు ఢీకొనడంతో విమానం దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.
విమానం ముందు భాగంలో రాబందు ఢీకొట్టడంతో పగుళ్లు ఏర్పడ్డాయని... ఇంజనీర్లు నష్టాన్ని అంచనా వేస్తున్నారని తెలిపారు అధికారులు. ఇవాళ మధ్యాహ్నం 1.14 గంటలకు ప్రమాదం జరిగినట్లు సమాచారం.