
ప్రస్తుతం అమెరికా కళాశాలల్లో విద్యార్థుల పట్ల వారి తీరుపై ట్రంప్ సర్కార్ ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందిన, పురాతనమైన విశ్వవిద్యాలయాల్లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(MIT) రాజకీయ ఉద్రిక్తతల మధ్య కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలో 2025 తరగతి అధ్యక్షురాలు, భారతీయ-అమెరికన్ విద్యార్థి మేఘా వేమూరి, తన వేదికను ఉపయోగించి పాలస్తీనా అనుకూలంగా గళం విప్పారు. ధైర్యంగా తన ప్రసంగంలో ఆమె ఇజ్రాయెల్తో విశ్వవిద్యాలయ సంబంధాలను తీవ్రంగా విమర్శించారు.
MIT స్వేచ్ఛా పాలస్తీనాను కోరుకుంటుందని మేఘా వేమూరి గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ క్రమంలో పాలస్తీనా సంఘీభావానికి చిహ్నమైన ఎర్రటి కెఫియే ధరించి అక్కడి వచ్చారామె. అలాగే కళాశాలలోని తోటి విద్యార్థులు దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులపై అమెరికాలోని అనేక విశ్వవిద్యాలయ క్యాంపస్ లలో కొనసాగుతున్న అశాంతి, సంఘర్షణలపై ట్రంప్ సర్కార్ ఫోకస్ పెట్టిన సమయంలో మేఘా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
MIT’s class president, Megha Vemuri, spent her graduation speech bashing Israel.
— Kassy Akiva (@KassyAkiva) May 29, 2025
Then President Sally Kornbluth spoke immediately after and oh boy was that awkward. pic.twitter.com/PjsBNEQxmy
మేఘా వేమూరి తన ప్రసంగంలో అమెరికాలోని విద్యారంగంలో నెలకొన్న అనిశ్చితి, విద్యార్థి కార్యకర్తలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఒత్తిళ్లపై మాట్లాడారు. ఈ పరిస్థితులు చాలా మంది విదేశీ విద్యార్థుల్లో భయాలను రేకెత్తించిందన్నారు. అమెరికా విశ్వవిద్యాలపై ప్రస్తుతం చీకటి మేఘాలు అలుముకున్నాయన్న వేమూరి.. ఇజ్రాయెల్ సైన్యంతో MIT పరిశోధన సంబంధాలపై అసహనం వ్యక్తం చేశారు. ఇది ఆ సంస్థకు అవమానమని, నైతిక సంఘర్షణకు మూలంగా ఉందన్నారు. పాలస్తీనాపై దాడులకు అమెరికా సహకరించటమే కాకుండా, తాను చదువుతున్న ఎంఐటీ కూడా అండగా నిలవటాన్ని ఆమె తప్పుపట్టారు.
ఈ క్రమంలో అనేక విశ్వవిద్యాల అధికారుల నుంచి విద్యార్థులు ప్రస్తుతం బెదిరింపులు కూడా అందుకుంటున్నారని మేఘా ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం గాజాలో విశ్వవిద్యాలయాలు మిగిలి లేవని, భూమిపై నుంచి పాలస్తీనాను ఇజ్రాయెల్ తన దాడులతో తుడిచిపెట్టేయాలని చూస్తోందని అన్నారు. దీనిలో ఎంఐటీ భాగంగా ఉండటం సిగ్గుచేటని తన ప్రసంగంలో మేఘా పేర్కొన్నారు. అయితే ఈ పరిస్థితులను ఆపటానికి తాము చేయాల్సిందంతా చేయవలసిన బాధ్యత తమపై ఉందన్నారు మేఘా వేమూరి. అయితే దీనిపై ట్రంప్ సర్కార్ ఎలా స్పందిస్తుందనే దానిపై వేచి చూడాల్సిందే.