జకర్తా: ఇండియా స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్, కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ లక్ష్యసేన్ ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నమెంట్లో శుభారంభం చేశారు. తొలి రౌండ్లో తమ ప్రత్యర్థులపై ఈజీగా గెలిచిన ఈ ఇద్దరూ ప్రిక్వార్టర్స్లో ముఖాముఖి పోరుకు రెడీ అయ్యారు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ పోరులో శ్రీకాంత్ 21–13, 21–19తో గ్వాంగ్ జు లు (చైనా)ను వరుస గేమ్స్లో చిత్తు చేశాడు. కొన్నాళ్లుగా నిరాశ పరుస్తూ 22వ ర్యాంక్కు పడిపోయిన తెలుగు షట్లర్ ఈ మ్యాచ్లో ప్రపంచ 13వ ర్యాంకర్ జు లుపై తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. అతనితో ఆడిన ఐదో మ్యాచ్లోనూ నెగ్గి హెడ్ టు హెడ్ రికార్డును 5–0కి పెంచుకున్నాడు.
తొలి గేమ్లో వరుసగా నాలుగు పాయింట్లు రాబట్టిన శ్రీకాంత్ అదే జోరుతో 11–7తో ఫస్టాఫ్ ముగించాడు. ఆ తర్వాత మరింత స్పీడు పెంచిన తెలుగు షట్లర్ వరుసగా ఐదు పాయింట్లతో 20–11తో ముందుకొచ్చి ఈజీగా గేమ్ నెగ్గాడు. రెండో గేమ్లో చైనా షట్లర్ పుంజుకునే ప్రయత్నం చేశాడు. ఆరంభంలోనే 5–5తో స్కోరు సమం చేశాడు. ఈ టైమ్లో అనుభవాన్ని చూపెట్టిన శ్రీకాంత్ పదునైన షాట్లు కొడుతూ 18–11తో ముందుకెళ్లాడు. వరుసగా ఆరు పాయింట్లు రాబట్టిన గ్వాంగ్ ఆతర్వాత 19–19తో స్కోరు సమం చేశాడు. చివర్లో ఎలాంటి తప్పిదం చేయని శ్రీ వరుసగా రెండు పాయింట్లతో గేమ్తో మ్యాచ్ ముగించాడు. మరో మ్యాచ్లో అన్సీడెడ్ లక్ష్యసేన్ 21–17, 21–13తో 8వ సీడ్ లీ జి జియా (మలేసియా)కు వరుస గేమ్స్లో చెక్ పెట్టి గురువారం శ్రీకాంత్తో అమీతుమీకి రెడీ అయ్యాడు. ఇంకో మ్యాచ్లో ప్రత్యర్థి వాకోరవ్ ఇవ్వడంతో ఇండియా యంగ్స్టర్ ప్రియాన్షు రజావత్ నేరుగా ప్రిక్వార్టర్స్ చేరాడు. విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో ఆకర్షి కశ్యప్ 10–21, 4–21తో రెండో సీడ్ అన్ సె యుంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది.