దేశంలోనే స్వచ్ఛ నగరంగా ‘ఇండోర్’ : వరుసగా ఆరోసారి తొలిస్థానం

దేశంలోనే స్వచ్ఛ నగరంగా ‘ఇండోర్’ : వరుసగా ఆరోసారి తొలిస్థానం

న్యూఢిల్లీ :  మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరం మరోసారి వార్తల్లో నిలిచింది. దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన న‌గ‌రంగా వరుసగా ఆరో ఏడాది తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది. ‘స్వచ్ఛ సర్వేక్షన్‌ 2022’ అవార్డుల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.రెండో స్థానంలో గుజరాత్‌లోని సూర‌త్‌ నగరం, మూడో స్థానంలో మహారాష్ట్రలోని నవీ ముంబై నిలిచింది. నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ అత్యంత స్వచ్ఛమైన న‌గ‌రాలుగా నిలిచాయి. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

* ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డ్స్‌- 2022’లో మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర ఉన్నాయి. పెద్ద నగరాల జాబితాలో ఇండోర్‌, సూరత్‌ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. నావి ముంబై, విజయవాడ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 100లోపు అర్బన్‌ లోకల్‌ బాడీస్‌ ఉన్న రాష్ట్రాల జాబితాలో త్రిపురకు ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చింది. 

* లక్షలోపు జనాభా కలిగిన నగరాల జాబితాలో మహారాష్ట్రలోని పంచ్‌గాని నగరం తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత పటాన్‌ (ఛత్తీస్‌గఢ్‌), కర్హాద్‌ (మహారాష్ట్ర) ఉన్నాయి. 

* లక్షకుపైగా జనాభా కలిగిన గంగా పరివాహక నగరాల్లో హరిద్వార్‌ తొలిస్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో వారణాసి, రిషికేశ్‌లు ఉన్నాయి. లక్షలోపు జనాభా కలిగిన నగరాల్లో బిజ్నోర్‌కు ఫస్ట్‌ ర్యాంక్‌, ఆ తర్వాత కన్నౌజ్‌, గర్‌ముఖ్తేశ్వర్‌ నగరాలు నిలిచాయి. 

* మహారాష్ట్రలోని డియోలాలి దేశంలోనే స్వచ్ఛమైన కంటోన్మెంట్ బోర్డుగా నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా 2016లో 73 నగరాలను పరిగణనలోకి తీసుకోగా.. ఈ ఏడాది ఏకంగా 4,354 నగరాలను పరిశీలించి అవార్డులు ప్రకటించారు.