- మన ఏవియేషన్ సెక్టార్లో బోలెడు అవకాశాలు
- ట్యాక్స్లు, ఎయిర్పోర్ట్ ఛార్జీల వలనే రేట్లు ఎక్కువ
- ఈ ఏడాది ఎయిర్లైన్ కంపెనీలకు భారీ లాభాలు
- తమ బోర్డులో రెండు ఇండియన్ కంపెనీల సీఈఓలకు చోటు: ఐఏటీఏ
న్యూఢిల్లీ: దేశ ఏవియేషన్ సెక్టార్లో బోలెడు అవకాశాలు ఉన్నాయని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) పేర్కొంది. ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఫ్యూచర్పై ఆశావహంగా ఉన్నామని తెలిపింది. ఈ ఏడాది జనవరి– ఏప్రిల్ టైమ్లో ఇండియన్ ఎయిర్లైన్ కంపెనీలు ఏకంగా 5.04 కోట్ల మందిని తమ గమ్య స్థానాలకు చేర్చాయి. కిందటేడాది ఇదే టైమ్లో రికార్డ్ అయిన 3.53 కోట్లతో పోలిస్తే ఇది 43 శాతం గ్రోత్కు సమానం. అంతేకాకుండా ఇండియన్ కంపెనీలు పెద్ద మొత్తంలో విమానాలకు ఆర్డర్లిస్తున్నాయి. బోయింగ్, ఎయిర్బస్ నుంచి 470 విమానాలకు ఎయిర్ఇండియా ఆర్డర్ పెట్టింది. ఇండిగో కూడా ఎయిర్బస్ నుంచి 500 విమానాలు కొనే ఆలోచనలో ఉంది. ఐఏటీఏ బోర్డులో మొదటిసారిగా రెండు ఇండియన్ కంపెనీల సీఈఓలకు చోటు లభించింది. 31 మంది సీఈఓలతో కూడిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (బీఓజీ) లో ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్బెల్ విల్సన్, ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ మెంబర్లుగా ఉన్నారు. వచ్చే ఏడాది జూన్ నుంచి ఎల్బర్స్ బీఓజీ చైర్మన్గా సేవలందిస్తారు.
విమాన టికెట్ల ధరలు ఎక్కువగా ఉండడానికి కారణం ట్యాక్స్లు, ఎయిర్పోర్ట్ ఛార్జీలు ఎక్కువగా ఉండడమేనని ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ పేర్కొన్నారు. ఇస్తాంబుల్లో జరిగిన ఐఏటీఏ యాన్యువల్ జనరల్ మీటింగ్ (ఏజీఎం) లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్బన్ ఎమిషన్స్ను తగ్గించడానికి ఇండియాతో సహా వివిధ దేశాలు తీసుకుంటున్న చర్యలను గుర్తించామని అన్నారు. ఏవియేషన్ సెక్టార్లో నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ను చేరుకోవడానికి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏఓ) ‘భిన్నమైన బాధ్యతలతో కూడిన ఒకే కామన్ గోల్’ ఉండేలా గైడ్లైన్స్ ఇవ్వాలని ఇండియన్ గవర్నమెంట్ కిందటి నెలలో పేర్కొంది. 2027 నాటికి నెట్జీరో ఎమిషన్స్ను చేరుకోవాలని ఇండియా టార్గెట్ పెట్టుకుందని ఏవియేషన్ సెక్రెటరీ రాజీవ్ బన్సల్ వెల్లడించారు. నెట్ జీరో ఎమిషన్స్ను చేరుకోవాలంటే తక్కువ ఉద్గారాలను విడుదల చేసే సస్టయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్స్ (ఎస్ఏఎఫ్) కు మరలడం ముఖ్యమని వాల్ష్ అన్నారు.
ఈ ఏడాది కంపెనీలకు 9.8 బిలియన్ డాలర్ల లాభం!
గ్లోబల్గా ఎయిర్లైన్ కంపెనీలకు ఈ ఏడాది భారీ లాభాలొస్తాయని వాల్ష్ అన్నారు. ఈ ఏడాది ఎయిర్లైన్ కంపెనీలు 9.8 బిలియన్ డాలర్ల నికర లాభం సంపాదిస్తాయని వివరించారు. కానీ, సప్లయ్ చెయిన్ సమస్యలతో ఖర్చులు పెరుగుతున్నాయని, ఎయిర్లైన్ కంపెనీలు విమానాలను మోహరించడంలో పరిమితులు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ఎయిర్లైన్ ట్రాఫిక్ కరోనా ముందు స్థాయిల్లో 90 శాతానికి చేరుకుందని పేర్కొన్నారు. ‘ఎయిర్పోర్ట్స్ బిజీగా ఉన్నాయి. హోటళ్లు నిండుతున్నాయి. లోకల్ ఎకానమీలు పుంజుకుంటున్నాయి. ఎయిర్లైన్ ఇండస్ట్రీ లాభాల్లోకి మరలుతోంది’ అని వాల్ష్ వివరించారు. గ్లోబల్గా ఎయిర్లైన్ కంపెనీలు ఈ ఏడాది 803 బిలియన్ డాలర్ల రెవెన్యూని సాధిస్తాయని అంచనా వేశారు. ప్రతీ ప్యాసింజర్పై సగటున 2.25 డాలర్లను కంపెనీలు సంపాదిస్తాయని అన్నారు. ఐఏటీఏలో మొత్తం 300 కి పైగా ఎయిర్లైన్స్ మెంబర్లు. వీటిలో ఇండియా కంపెనీలూ ఉన్నాయి.
ఇండియాలో విస్తరిస్తున్నాం..
ఇండియన్ మార్కెట్పై బుల్లిష్గా ఉన్నామని లుఫ్తాన్సా గ్రూప్ సీఈఓ కార్ట్స్న్ స్పోర్ అన్నారు. ఎయిర్ఇండియాతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ‘ఇండియాలో మా పొజిషన్ను బలపరుచుకున్నాం. ఇంకా విస్తరించాలని, మరిన్ని విమానాలు తిప్పాలనే ప్లాన్లో ఉన్నాం. ఒకప్పటి కంటే భిన్నంగా ఉన్న ఎయిర్ ఇండియాతో టై అప్ అయ్యాం. మా మార్కెట్ షేర్ను పెంచుకుంటాం’ అని వివరించారు.
ఎయిర్బస్కు ఇండిగో భారీ ఆర్డర్. .
500 విమానాలను కొనుగోలు చేసేందుకు ఎయిర్బస్తో ఇండిగో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇందులో ఏ320 చిన్న బాడీ విమానాలు ఉంటాయి. ఈ డీల్ విలువ సుమారు 50 బిలియన్ డాలర్లు ఉంటుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఇండిగోకి విమానాలను అమ్మడానికి బోయింగ్ కూడా ప్రయత్నాలు చేస్తోంది. కంపెనీ 25 ఏ330 నియో లేదా బోయింగ్ 787 పెద్ద విమానాలను అమ్మాలని చూస్తోంది. ఈ విషయంపై బోయింగ్, ఎయిర్బస్ స్పందించలేదు.