3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు .. రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి హైకోర్టు డెడ్లైన్

3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు .. రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి హైకోర్టు  డెడ్లైన్
  • సెప్టెంబర్ 30లోగా ఫలితాలూ వెల్లడించాలని తీర్పు
  • వార్డులు, రిజర్వేషన్ల ఖరారు కోసం సర్కార్​కు 30 రోజుల గడువు
  • ఆ తర్వాత ఎలక్షన్స్​ కోసం ఎన్నికల సంఘానికి 60 రోజుల టైమ్​
  • ఏడాదిన్నరగా ఎలక్షన్స్​ జరపకపోవడం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీలకు మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. ‘‘30 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేయాలి. ఆ తర్వాత 60 రోజుల్లోగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణను పూర్తి చేయాలి. సెప్టెంబర్‌ 30 నాటికి, లేదా అంతకంటే ముందు ఫలితాలు కూడా వెల్లడించాలి” అని ఆదేశించింది. ఎన్నికల కోసం దాఖలైన ఆరు వేర్వేరు పిటిషన్లపై బుధవారం ఎనిమిది పేజీల తుది తీర్పును జస్టిస్‌ టి. మాధవీదేవి వెలువరించారు. గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసినప్పటికీ ఎన్నికలు జరపకపోవడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పులో హైకోర్టు పేర్కొంది. 

నిరుడు జనవరి 31తో సర్పంచుల పాలన ముగిసిందని, అంటే ఏడాదిన్నరగా గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడం   ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకమని తెలిపింది. రాజ్యాంగం ప్రకారం, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఈ ఎలక్షన్స్​ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని తెలిపింది. 

ఆలస్యానికి గల కారణాల్లోకి వెళ్లడం లేదు

ఎన్నికలు జరపకపోవడం వల్ల దాదాపు ఏడాదిన్నరగా గ్రామాల్లో ప్రజాపాలన లేకుండాపోయిందని హైకోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. ఎన్నికలు ఆలస్యం కావడానికి గల కారణాల్లోకి తాము వెళ్లడం లేదని పేర్కొంది. 

‘‘ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఐదు దశలను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడువు కోరింది. ఇప్పటికే మూడు దశలు పూర్తి చేసినట్లు వెల్లడించింది. మిగిలిన రెండు దశలైన వార్డుల ఎంపిక, రిజర్వేషన్ల ఖరారుకు కనీసం 20 రోజుల గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది. అయితే.. ఈ తీర్పు ప్రతి అందినప్పటి నుంచి 30 రోజుల వరకు గడువు ఇస్తున్నాం” అని హైకోర్టు తెలిపింది. ‘‘మిగిలిన దశలను 30రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్​కు అందజేయాలి. 

ఆ తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల 60 రోజుల్లో ఎన్నికల నిర్వహణను కంప్లీట్​ చేయాలి. ఎన్నికలు ఏయే తేదీల్లో నిర్వహించాలో నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఇవ్వాలి.మొత్తంగా ఈ ఏడాది సెప్టెంబర్ 30 లోగా, లేదా అంతకంటే ముందుగానే గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడించాలి” అని స్పష్టం చేసింది. ఐదేండ్ల పాలకవర్గం గడువు ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాలనే ఆర్టికల్స్​, సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయడం లేదన్న పిటిషనర్ల వాదన ఆమోదయోగ్యమైదని హైకోర్టు పేర్కొంది. 

కేంద్రం నుంచి నిధులూ వస్తలేవు: పిటిషనర్లు

గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు 2024 జనవరి 31తో ముగిసిందని, సర్పంచుల పదవీకాలం ముగిసినా ఎన్నికలు జరపడం లేదంటూ మాజీ సర్పంచులు ఆరు పిటిషన్లు దాఖలు చేయగా.. వాదనలు విన్న హైకోర్టు తీర్పు వెలువరించింది. సర్పంచ్‌‌‌‌‌‌‌‌ల పరిపాలన లేక గ్రామాల్లో అభివృద్ధి వెనుకబడుతున్నదని పిటిషనర్ల లాయర్‌‌‌‌‌‌‌‌ భాస్కర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇతరులు వాదించారు. ‘‘నిరుడు జనవరి 31తో సర్పంచుల పదవీ కాలం ముగిసినా ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నది. ఇది రాజ్యాంగ వ్యతిరేకం. సర్పంచులను తప్పించి పంచాయతీల నిర్వహణ బాధ్యతలను స్పెషలాఫీసర్లకు అప్పగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉంది.

 స్పెషలాఫీసర్లు వారికున్న ఇతర విధుల్లో బిజీగా ఉండటంతో గ్రామాల్లో ప్రజాసమస్యలు పరిష్కారం కావడం లేదు” అని పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులు సమకూరుస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఎంతో మంది సర్పంచులు సొంత డబ్బుతో పనులు చేసి చేతులు కాల్చుకున్నారు. అప్పులు చేసిన గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశారు. అయితే.. ప్రభుత్వం నుంచి ఆ నిధులు అందక నానా అవస్థలు పడుతున్నారు” అని తెలిపారు. పాలకవర్గాలు లేకపోవడం వల్ల వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా రావడం లేదన్నారు. వెంటనే  గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులు ఇవ్వాలని.. ఎన్నికలు జరపడంలో లేటైతే తాజా మాజీ సర్పంచులకే పాలనాబాధ్యతలను అప్పగించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. 

ఎన్నికల సంఘం చొరవ చూపాలి కదా: హైకోర్టు

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియను చేపట్టాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌ ఇమ్రాన్‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌ వాదనల్లో ప్రస్తావించారు. ఈ ప్రక్రి య పూర్తికావడానికి కనీసం నెల రోజులు అవసరమని తెలిపారు. ఈ దశలో జడ్జి జోక్యం చేసుకుంటూ.. ఎన్నికల నిర్వహణపై గతంలో ఒకసారి హామీ ఇచ్చి కూడా ఎందుకు   అమలు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం తరఫున సీనియర్‌‌‌‌‌‌‌‌ అడ్వకేట్​ జి.విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌ వాదనలు వినిపిస్తూ.. బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. ఇది పూర్తయితేనే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించగలమని స్పష్టం చేశారు. 

వార్డుల విభజన, రిజర్వేషన్​ అంశాలు రాష్ట్ర ప్రభుత్వం చేశాకే తాము ఎన్నికలు నిర్వహించగలమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఆమోదం చెప్పిన తర్వాత నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి రెండు నెలల సమయం అవసమన్నారు. దీనిపై జోక్యం చేసుకు న్న జడ్జి.. సకాలంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘం చొరవ తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దీనిపై న్యాయవాది స్పందిస్తూ.. రిజర్వేషన్ల ఖరారుతో పాటు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, పోలింగ్‌‌‌‌‌‌‌‌ స్టేషన్ల ఏర్పాట్లు, భద్రత వంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వమే చేయాలన్నారు. అన్ని పక్షాల వాదనలు పూర్తి కావడంతో 3 నెలల్లోగా ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశిస్తూ జడ్జి తీర్పు వెలువరించారు.