
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ కార్పొరేట్ స్పోర్ట్స్ టోర్నమెంట్ 2024-–25 ఎడిషన్లో ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఓవరాల్ చాంపియన్షిప్ సొంతం చేసుకుంది. టీసీఎస్ రన్నరప్గా నిలవగా, సింక్రోనీ మూడో స్థానం సాధించింది. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) నిర్వహించిన ఈ మెగా ఈవెంట్లో 60 హైసియా సభ్య కంపెనీల నుంచి 2 వేల మందికి పైగా ఉద్యోగులు 15 క్రీడల్లో పోటీపడ్డారు. టీమ్ ఈవెంట్లలో 270కి పైగా జట్లు పాల్గొన్నాయి.
మెన్స్ క్రికెట్ లో రియల్పేజ్ విజేతగా నిలవగా, ఇన్ఫోసిస్ రన్నరప్ ట్రోఫీ అందుకుంది. బ్యాడ్మింటన్ లో ఇన్ఫోసిస్, టీసీఎస్ టాప్-–2లో నిలవగా, కబడ్డీలో ఇన్ఫోసిస్, హెచ్ఎస్బీసీ విన్నర్, రన్నరప్ ట్రోఫీలు గెలిచాయి. నేషనల్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.. ఇన్ఫోసిస్ గచ్చిబౌలి వీపీ, డీసీ హెడ్ రఘు బొడ్డుపల్లి, హైసియా ప్రెసిడెంట్ ప్రశాంత్తో కలిసి విజేతలకు అవార్డులు అందజేశాడు. క్రీడలు యువత, ఫిట్నెస్ ఉన్నవారికే పరిమితం కాకూడదని, అన్ని వయసుల వారూ పాల్గొనే సంబరంగా మారాలని గోపీ అభిప్రాయపడ్డాడు.