
న్యూఢిల్లీ: తన పిల్లల ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాక్ చేశారంటూ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ దీనిపై దర్యాప్తు చేస్తుందని బుధవారం తెలిపింది. యోగి ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాపింగ్ చేసిందని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. దీనిపై ప్రియాంకను మీడియా ప్రశ్నించగా, ఫోన్ ట్యాపింగ్ సంగతి అలా ఉంచండి.. నా పిల్లల ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను కూడా హ్యాక్ చేస్తున్నారు.. వాళ్లకేం పనిలేదా? అని యూపీ సర్కారును ఆమె ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై సీఎం యోగి స్పందిస్తూ.. అఖిలేశ్ హయాం లో హ్యాక్ చేసి ఉండొచ్చు.. అందుకే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.