- రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాసరెడ్డి తీరుతో బాధితుల ఆందోళన
గద్వాల, వెలుగు : ఆంధ్రప్రదేశ్లోని డోన్ పట్టణానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాసరెడ్డి గద్వాల కోర్టులో ఐపీ(ఇన్ సాల్వెన్సీ పిటిషన్) దాఖలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం అనంతపురంలో నివసిస్తూ ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న ఆయన, దేశవ్యాప్తంగా సుమారు 226 మంది నుంచి రూ.210 కోట్లుఅప్పుగా తీసుకున్నట్లు సమాచారం.
అధిక వడ్డీ ఆశ చూపి సేకరించిన ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించలేక, అప్పుల వారి ఒత్తిడి తట్టుకోలేక ఆయన గద్వాలలోని చింతలపేట కాలనీలో నివసిస్తున్నట్లు చూపిస్తూ కోర్టును ఆశ్రయించారు. తన వద్ద కేవలం రూ.35కోట్ల నుంచి రూ.40 కోట్ల విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నాయని పేర్కొనడంతో, అప్పులు ఇచ్చిన బాధితులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తమ సొమ్ము తిరిగి వస్తుందో, లేదోనని బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
