వెంకటాపురం, వెలుగు: తెలంగాణ–చత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల ప్రాంతాల్లో అభివృద్ధి పనుల పురోగతి బాగుందని సీఆర్పీఎఫ్ సౌత్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవిదీప్సింగ్ సాహి అన్నారు. ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్తో కలిసి కర్రెగుట్టల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రవిదీప్సింగ్ సాహి మాట్లాడుతూ.. మావోయిస్టుల ప్రభావంతో గత 50 ఏండ్లుగా అభివృద్ధికి నోచుకోని కర్రెగుట్టలో సీఆర్పీఎఫ్, పోలీసుల ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. స్థానిక గిరిజనులకు విద్య, వైద్యం సకాలంలో అందించడానికి రోడ్ల నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు. కొండలు, గుట్టలు, లోయలతో కూడిన అత్యంత క్లిష్టమైన భూభాగంలో రహదారి, అభివృద్ధి పనులు చేపట్టడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.
కర్రెగుట్ట ఏరియాలోని మోరుమూరు నుంచి పామునూరు, జెల్లా, డోలి, తడపాల కొండల వరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయడంతో అభినందనలు తెలిపారు. అనంతరం పామునూరు సీఆర్పీఎఫ్ క్యాంప్ను సందర్శించి భద్రతాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రతా బలగాల సమన్వయం, సరిహద్దు ప్రాంత భద్రత, మావోయిస్టు వ్యతిరేక చర్యలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై చర్చించారు. కార్యక్రమంలో హైదరాబాద్ రేంజ్ డీఐజీ అనిల్ మింజ్, 81 బెటాలియన్ కమాండెంట్ ముఖేశ్ కుమార్ సింగ్, 39వ బెటాలియన్ సెకండ్ ఇన్ కమాండ్ పంచం లాల్, జాంగ్షేర్, వెంకటాపురం సీఐ ముత్యం రమేశ్, ఎస్సై తిరుపతిరావు పాల్గొన్నారు.
