
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సెక్టార్ను మార్చేందుకు ప్రభుత్వం తీసుకురావాలని చూస్తున్న ‘నేషనల్ ఈ–కామర్స్ పాలసీ’ చివరి స్టేజ్లో ఉందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఇండస్ట్రీ వర్గాల ఫీడ్బ్యాక్ కోసం కొత్తగా డ్రాఫ్ట్ పాలసీని ఇష్యూ చేసే ఉద్దేశం ఏం లేదని వెల్లడించారు. ఈ–కామర్స్ పాలసీని కామర్స్ మినిస్ట్రీ రెడీ చేస్తోంది. ఈ–కామర్స్ కంపెనీలు, దేశంలోని ట్రేడ్ ఆర్గనైజేషన్లతో ఈ నెల 2 న డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ (డీపీఐఐటీ) ప్రతినిధులు సమావేశమయ్యారు. కొత్త పాలసీపై ఇండస్ట్రీవర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చాయని సంబంధిత వ్యక్తులు వివరించారు. ‘కొత్త డ్రాఫ్ట్ పాలసీ ఇక రాదు. ఆ పనులన్నీ అయిపోయాయి. పాలసీ తీసుకురావడంలో చివరి స్టేజ్లో ఉన్నాం’ అని వెల్లడించారు. డేటా లోకలైజేషన్పై కంపెనీ ఇక్కడి చట్టాలను పాటించాల్సిందేనని తెలిపారు.
నేషనల్ ఈ–కామర్స్ పాలసీ..
కొత్తగా తెస్తున్న ఈ–కామర్స్ పాలసీ డేటా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఈ–కామర్స్ మార్కెట్ప్లేస్, రెగ్యులేటరీ ఇష్యూస్, డిజిటల్ ఎకానమీ, ఈ–కామర్స్ ద్వారా ఎగుమతులను ప్రోత్సహించడంపై ఫోకస్ చేస్తోంది. 2019లో పాలసీపై ప్రపోజల్స్ రాగా, తాజాగా రెండు డ్రాఫ్ట్ పేపర్లను ప్రభుత్వం విడుదల చేసింది. విదేశాలకు డేటా పంపడంపై రిస్ట్రిక్షన్లు పెట్టడం, లోకల్గా సెన్సిటివ్ డేటాను సేకరించడం, నకిలీ ప్రొడక్ట్లను అమ్మడంపై చర్యలు తీసుకోవడం, నిషేధిత జాబితాలోని ఐటెమ్స్, దొంగిలించిన ఐటెమ్స్ గురించి ఈ డ్రాఫ్ట్ పాలసీలో ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్లపై ఎటువంటి కస్టమ్ డ్యూటీ వేయడం లేదు. ఈ అంశాన్ని రివ్యూ చేస్తున్నారు. కన్జూమర్ ప్రొటెక్షన్ కోసం ప్రభుత్వం రూల్స్ తీసుకొస్తోంది.