- అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
- జులై ఫస్ట్ వీక్ కేబినెట్ భేటీలో పరిపాలన
- అనుమతులకు గ్రీన్ సిగ్నల్
- రివర్ బెడ్లో ఉన్న పేదలకు
- తక్షణమే డబుల్ బెడ్రూం ఇండ్లు
- భూసేకరణ కోసం టీడీఆర్ లేదంటే..
- చట్ట ప్రకారం పరిహారం నెక్లెస్ రోడ్లో మూసీ
- ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచన
- మూసీ ప్రాజెక్టు పురోగతిపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ మొదటి దశ ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా అడుగులు వేస్తున్నది. శుక్రవారం హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో మూసీ ప్రాజెక్టు పురోగతిపై సీఎం రేవంత్రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
మూసీ నదీ పరివాహక ప్రాంతంలో ఇండ్లు కోల్పోయే నిర్వాసితుల పట్ల మానవీయ కోణంలో వ్యవహరించాలని ఆదేశించారు. రివర్ బెడ్లోని పేదలకు తక్షణమే డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించాలని స్పష్టం చేశారు. అలాగే, ప్రాజెక్టు భూసేకరణ కోసం భూములు ఇచ్చేందుకు ఆసక్తి ఉన్న వారికి టీడీఆర్ ఇవ్వాలని, లేనిపక్షంలో చట్టప్రకారం తగిన పరిహారం చెల్లించి భూములను సేకరించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టైమ్లైన్ను పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా కన్సల్టెంట్ ద్వారా మే 23న సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పణ ప్రక్రియ ఇప్పటికే విజయవంతంగా పూర్తయింది. మొదటి దశ పనుల పరిపాలనా అనుమతుల ఫైలు ప్రస్తుతం పరిశీలనలో ఉండగా, జులై మొదటి వారంలో జరగబోయే మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఆ వెంటనే జులై 5లోగా సాంకేతిక అనుమతులు పూర్తి చేసి.. ఎన్ఐటీ ద్వారా టెండర్లను పిలవాలని స్పష్టం చేశారు. అనంతరం ఆగస్టు 19 కల్లా టెండర్ల ప్రక్రియ అంతా ముగించి, పనులను ఖరారు (అవార్డ్) చేయాలన్నారు.
