హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి13 వరకు జరగనున్న ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు జరగనున్న ఈ పరీక్షలకు విద్యార్థులను ఉదయం 8గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 9గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, ఒక్క నిమిషం లే టయినా విద్యా ర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4,90,169మంది విద్యా ర్థులు పరీక్షకు హాజరుకానున్నారని, 24,508 మంది ఇన్విజిలేటర్లను నియమించామని తెలిపారు.గురువారం నుంచి సెకండియర్ పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. విద్యార్థులు ఇంటర్ బోర్డు వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు తీసుకోవచ్చని, సమస్యలు ఎదురైతే ఇంటర్ బోర్డు ఆఫీస్ 040- 24601010, 24732369కు ఫోన్ చేయాలని సూచించారు.
పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంచినీరు, విద్యుత్ తో పాటు వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.