జిలెటిన్ స్టిక్స్తో నాకేలాంటి సంబంధం లేదు : గడ్డం చంద్రశేఖర్రెడ్డి

జిలెటిన్ స్టిక్స్తో నాకేలాంటి సంబంధం లేదు : గడ్డం చంద్రశేఖర్రెడ్డి
  • రాజకీయ  కుట్రలో భాగంగానే అరెస్ట్​

కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డిలో ఇటీవల దొరికిన జిలెటిన్ స్టిక్స్​తో తనకు ఎలాంటి సంబంధం లేదని, రాజకీయ కుట్రలో భాగంగానే కేసులో ఇరికించారని  పీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్​రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం  జిల్లా కేంద్రంలోని తన ఆఫీస్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. టౌన్​లో ఇటీవల జిలెటిన్​ స్టిక్స్ దొరికితే తన పేరు ఎఫ్ఐఆర్​లో చేర్చారన్నారు.  పోలీసు అధికారులు చెబుతున్న వెంచర్​లో  తన పేరిట భూమి రిజిస్ర్టేషన్ లేదన్నారు.  ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్​కు ఫిర్యాదు చేస్తానన్నారు.  రాజకీయంగా ఎదుగుదలను ఓర్వలేక కొందరు కేసులో ఇరికించారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు  ముందు బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్ లో చేరానని రేవంత్​రెడ్డి ఇక్కడ పోటీ చేయగా ప్రచారం చేశానన్నారు.  

తన సేవలను గుర్తించి  పీసీసీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పజెప్పారన్నారు.  అశోక్​నగర్ చౌరస్తాలో అరెస్ట్​చేసినట్లు పోలీసులు చూపారని,  వెంచర్ కాగితాలు ఇచ్చేందుకు స్టేషన్​కు వెళ్లానన్నారు. అక్కడ ఏఎస్పీ  ఉన్నారని,  కొద్ది సేపటి తర్వాత ఎస్పీ దగ్గరకు వెళ్దామని చెప్పి  బాన్సువాడకు తీసుకెళ్లారన్నారు.  అక్కడ ఓ స్కూల్​ వద్ద కూర్చొబెట్టి వివరాలు అడిగారన్నారు. తర్వాత హాస్పిటల్​కు తీసుకెళ్లి పరీక్షలు చేయించి బిచ్​కుంద జడ్జి ఎదుట హాజరు పర్చి జైలుకు తరలించారన్నారు. తానే స్టేషన్​కు వెళితే, అరెస్ట్​చేశామని చూపడం సమంజసం కాదన్నారు.    కేసులో అక్రమంగా అరెస్ట్​చేసిన విషయంపై ఐజీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.