
రాజన్న సిరిసిల్ల, వెలుగు: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా రోడ్డు భద్రతపై కలెక్టరేట్లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి, నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. సిరిసిల్లలోని వెంకటాపూర్ జంక్షన్, వేములవాడ నాంపల్లి ఎక్స్ రోడ్, అనుపురం, ముస్తాబాద్, తంగళ్లపల్లి, పెద్దూరు, రగుడు జంక్షన్ల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. సమావేశంలో ఆర్టీఏ నాన్ అఫీషియల్ మెంబర్ సంగీతం శ్రీనాథ్, ఆర్అండ్బీ ఈఈ వెంకట రమణయ్య, ఆర్టీవో లక్ష్మణ్, డీఈవో వినోద్, డీపీవో షరీఫుద్దీన్, డీఎంహెచ్వో రజిత, మున్సిపల్ కమిషనర్లు, పోలీసు, ఎక్సైజ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
ఇసుక, మట్టి సమస్య రాకుండా చర్యలు
ముస్తాబాద్ వెలుగు: ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక, మట్టి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా తెలిపారు. శుక్రవారం ముస్తాబాద్ మండలకేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కల నెరవేరుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులను కోరారు.
జిల్లాలో 200 మంది యువకులకు వాహనాలు అందించి, వారి ద్వారా ఇసుక, మట్టి తరలింపునకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం గూడెం గ్రామం పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో లీడర్లు కేకే మహేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తలారీ రాణి, హౌసింగ్ పీడీ ఆఫీసర్ శంకర్, డీఆర్డీవో శేషాద్రి, మండల ప్రత్యేక అధికారి ఎంఏ భారతి, తదితరులు పాల్గొన్నారు.