కరోనా ఎఫెక్ట్ తో ఇంటర్ ఎగ్జామ్స్ స్పాట్ వాల్యూయేషన్ ఆగిపోయింది. కరోనా నియంత్రించేందుకు అధికారులు సరైన చర్యలేవి తీసుకోలేదంటూ విధులు నిర్వహణకు హాజరైన సిబ్బంది.. వెంటనే ఇంటిబాట పట్టారు. ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తున్న ఈ కరోనా భయంతో ప్రజలంతా భయపడుతున్నారు. వైరస్ ను నియంత్రించడానికి ఇప్పటికే చాలా మంది తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మాస్క్ లు ధరిస్తూ, వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ తమను తాము వైరస్ బారి నుండి కాపాడుకుంటున్నారు.
అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటర్ పరీక్షా పేపర్లు దిద్దడానికి వచ్చిన సిబ్బంది ఈ వైరస్ కారణంగా విధులు బహిష్కరించారు. సెంటర్ లో ఎలాంటి జాగ్రత్తలు పాటించలేదని ఆరోపిస్తూ.. వచ్చిన వారిలో 30 శాతం మంది ఇంటికి వెళ్లిపోయారు. మరోవైపు నల్గొండ జిల్లా కేంద్రంలో కూడా ఈ స్పాట్ వాల్యూయేషన్ ను పోస్ట్ పోన్ చేయాలంటూ జూనియర్ లెక్చరర్లు విధుల బహిష్కరించారు. సెంటర్ ముందు బైఠాయించి తమ నిరసన తెలిపారు.