
వికారాబాద్, వెలుగు: ఇంటర్ అడ్వాన్స్డ్, సప్లీమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 22 నుంచి 28 వరకు రెండు సెషన్లో పరీక్షలు నిర్వహిస్తున్నందున అందుకు అనుగుణంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలన్నారు.
ప్రతి పరీక్ష కేంద్రంలో మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఫస్టియర్ పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు సెకండియర్ పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలోని 10 పీఎస్పరిధిలో 20 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 5,217 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్, జిల్లా మెడికల్ ఆఫీసర్ వెంకటరమణ, ఆర్టీసీ డిపో మేనేజర్ అరుణ, జిల్లా ఇంటర్ నోడల్ అధికారి శంకర్ నాయక్ ఉన్నారు.