- మాజీ ఎమ్మెల్యే కొమ్మూరిని సస్పెండ్ చేసిన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగాజీ
- ఆయనకు ఆ అధికారం లేదన్న కొమ్మూరి
జనగామ, వెలుగు: జనగామ జిల్లా కాంగ్రెస్ లీడర్ల మధ్య ఇంతకాలం అంతర్గతంగా ఉన్న విభేదాలు గురువారం రచ్చకెక్కాయి. మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ సభ్యుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాసాన్పల్లి లింగాజి ప్రకటించారు. దీంతో తనను సస్పెండ్ చేసే అధికారం ఆయనకు లేదని, మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని కొమ్మూరి ఫైర్ అయ్యారు. సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ జిల్లాలోకి ప్రవేశిస్తున్న సమయంలో లీడర్ల మధ్య గొడవలు జరగడంతో కేడర్ అమయోమయానికి గురవుతున్నారు.
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే సస్పెన్షన్
జనగామ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాసా న్ పల్లి లింగాజీ గురువారం స్థానికంగా మీడియాతో మాట్లాడారు. పార్టీ కమిటీలకు సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా కార్యక్రమాలను చేపడుతున్నందున క్రమశిక్షణ ఉల్లంఘన కింద కొమ్మూరి ప్రతాప్రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.ఆయనపై హైకమాండ్కు, క్రమశిక్షణా సంఘానికి, జిల్లా నాయకత్వానికి అనేక ఫిర్యాదులు అందాయని, పలుమార్లు హెచ్చరించినా తన పద్ధతి మార్చుకోవడం లేదన్నారు. ఆయన ఇప్పటికే పలు పార్టీలు మారాడని, ఆయన తీరుతో పార్టీకి నష్టం కలిగేలా ఉందన్నారు. జనగామ నియోజకవర్గంలో వర్గాలు లేవని పొన్నాల లక్ష్మయ్య నాయకత్వంలోనే ముందుకు సాగనున్నట్లు చెప్పారు. సమావేశంలో చెంచారపు శ్రీనివాస్రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, ఎండీ.మాజీద్, మూడావత్ సంపత్నాయక్, ప్రవీణ్, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
పొన్నాలనే సస్పెండ్ చేసిన్రు
కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించాలని కుట్ర చేస్తున్న టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సీనియర్లు హైకమాండ్ కు ఫ్యాక్స్ చేశారని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి చెప్పారు. గురువారం సాయంత్రం జనగామలో మీ డియాతో మాట్లాడారు. టీపీసీసీ మెంబర్గా ఉన్న తనను సస్పెండ్ చేసే అధికారం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్కు లింగాజీకి లేదన్నారు. హాత్సే హాత్ జోడో యాత్రతో పాటు, పార్టీ బలోపేతానికి పనిచేస్తున్న తన పట్ల అనుచిత నిర్ణయాలు తీసుకుంటే పార్టీ శ్రేణులే బుద్ధి చెబుతాయన్నారు. కాంగ్రెస్కు గెలిపించాలన్న లక్ష్యంతో పనిచేస్తుంటే పొన్నాల వర్గం రాజకీయం చేస్తోందని విమర్శించారు. కంచె రాము లు, జిల్లెల సిధారెడ్డి, గంగం నరసింహారెడ్డి, లింగాల నర్సిరెడ్డి, ఆలేటి సిద్ధిరాములు, శ్రీనివాస్, మల్లేశం పాల్గొన్నారు.