2020కి లిస్టు విడుదల చేసిన ఇంటర్నేషనల్ ఎస్వోఎస్
భద్రమైన దేశాల్లో ఫిన్లాండ్, నార్వే, ఐస్లాండ్ టాప్
విదేశాలకు టూరేసే వాళ్లు తాము పోయే దేశం సేఫా.. కాదా తెలుసుకోవడం చాలా ముఖ్యం. తీరా అక్కడికి పోయాక తేడా వస్తే నానా తిప్పలు పడాల్సి ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాలమీదకే వస్తుంది. అందుకే ట్రావెలర్ల భద్రత కోసం ఇంటర్నేషనల్ ఎస్వోఎస్ కంపెనీ యేటా భూమ్మీద డేంజరస్ ప్లేసుల లిస్టును ‘ట్రావెల్ రిస్క్ మ్యాప్’ పేరుతో విడుదల చేస్తుంటుంది. ఈ యేడాదీ లిస్టు రిలీజైంది. 2020కి గాను ట్రావెలర్లకు డేంజరస్ ప్లేసుల లిస్టులో లిబియా, సోమాలియా, అఫ్ఘానిస్థాన్, వెనెజులా దేశాలు ముందున్నాయని నివేదిక వెల్లడించింది. భద్రమైన దేశాల్లో ఫిన్లాండ్, నార్వే, ఐస్లాండ్, స్వీడన్, గ్రీన్లాండ్ ఫస్టున్నాయంది. మెడికల్ ప్రాబ్లమ్స్, సెక్యూరిటీ, రోడ్ సెఫ్టీ సమస్యలను లెక్కలోకి తీసుకుని లిస్టును కంపెనీ విడుదల చేసింది.
సెక్యూరిటీలో అఫ్ఘానిస్థాన్ లాస్ట్
ప్రమాదకర రోగాలొచ్చే దేశాల్లో (మెడికల్ ప్రాబ్లమ్స్)లో ఆఫ్రికా దేశాలైన నైజర్, గినియా, సియెర్రా లియోన్, లైబీరియా, సౌత్ సుడాన్, ఎరిత్రియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఉన్నాయని నివేదిక వెల్లడించింది. యెమెన్, సిరియా, ఉత్తరకొరియా దేశాలూ లిస్టులో ఉన్నాయంది. రోగాల సమస్యల్లేని దేశాల్లో యూరప్, కెనడా, అమెరికా, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, జపాన్ ఫస్టున్నాయని కంపెనీ చెప్పింది. రాజకీయ కల్లోలం, అల్లర్లు, నిరసనలున్న దేశాల్లో పర్యటనకు వెళ్తే భద్రత సమస్యలొస్తాయని.. ఇలాంటి సెక్యూరిటీ విషయంలో అఫ్ఘానిస్థాన్, సిరియా, యెమెన్, ఇరాక్, సోమాలియా, లిబియా, నైజీరియా అట్టడుగున ఉన్నాయని నివేదిక చెప్పింది. ట్రావెలర్లకు భద్రమైన దేశాల్లో నార్వే, గ్రీన్లాండ్, ఫిన్లాండ్, ఐస్లాండ్, స్విడ్జర్లాండ్, స్లోవేనియా ముందున్నాయంది. రోడ్ సేఫ్టీలో ఆఫ్రికా దేశాలు లిస్టులో కిందున్నాయని.. వీటితో పాటు వెనెజులా, బెలిజే, డొమినికన్ రిపబ్లిక్, సౌదీ అరేబియా, థాయ్లాండ్, వియత్నాం దేశాల్లోనూ రోడ్ సేఫ్టీ సరిగా లేదని నివేదిక చెప్పింది. ఈ లిస్టులో చాలా యూరోపియన్ దేశాలతో పాటు జపాన్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ టాప్లో ఉన్నాయంది. వచ్చే యేడాది ఈ రిస్కు ఇంకా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
