ఇంటర్ స్టేట్ చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్.. ఢిల్లీ నుంచి వచ్చిన నిందితులు.. మహిళలే టార్గెట్ గా చోరీలు

ఇంటర్ స్టేట్ చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్..     ఢిల్లీ నుంచి వచ్చిన నిందితులు.. మహిళలే టార్గెట్ గా చోరీలు

 జీడిమెట్ల, వెలుగు: ఢిల్లీ నుంచి వచ్చి, మహిళలే టార్గెట్ గా చైన్​స్నాచింగ్​కు పాల్పడుతున్న ఇంటర్ స్టేట్​చైన్​స్నాచింగ్ ముఠాను పేట్​బషీరాబాద్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. పేట్​బషీరాబాద్​పోలీస్ స్టేషన్​పరిధిలోని గుండ్లపోచంపల్లిలో హనుమాన్ గడ్డ మేరు హాస్పిటల్​వద్ద ఈ నెల 10న ఓ మహిళ వాకింగ్ చేస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు బైక్​పై వచ్చి ఆమె మెడలోని పుస్తెల తాడును లాక్కొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

 అనుమానంతో కండ్లకోయలో దొంగతనానికి పాల్పడిన అజయ్​శక్కర్​వాల్, రాహుల్​ సక్సేనా, రాజేశ్​కుమార్, సాగర్​ రామ్​పాల్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఢిల్లీకి చెందినవారని, బోయిన్​పల్లి పోలీస్​స్టేషన్ పరిధిలో 2 బైక్​లను చోరీ చేశారని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. 

వాటిపైనే తిరగుతూ దొంతతనాలు చేస్తున్నారని పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి 3 తులాల పుస్తెలతాడు, 2 బైక్​లు, 2 స్మార్ట్​ఫోన్స్, 2 కీ ప్యాడ్​ఫోన్లు, హ్యాండిల్ స్క్రూడ్రైవర్లు స్వాధీనం చేసుకొని, వారిని అరెస్ట్​చేసినట్లు చెప్పారు. ఈ నలుగురిపై ఢిల్లీలోని పలు పోలీస్ స్టేషన్లలో 4 కేసులు , బోయిన్​పల్లిలో 2 కేసులున్నట్లు పేర్కొన్నారు.