దోపిడీకి రెక్కీ నిర్వహిస్తున్న 21 మంది గ్యాంగ్ అరెస్టు

దోపిడీకి రెక్కీ నిర్వహిస్తున్న 21 మంది గ్యాంగ్ అరెస్టు

కడప: కడప జిల్లాలో అంతర్రాష్ట్ర దోపిడీ గ్యాంగ్ కలకలం రేపింది. ఏకంగా 21 మంది దోపిడీ దొంగలను రాజంపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల దొంగతనాలకు దోపిడీ దొంగల ముఠా స్కెచ్ వేసిన వైనం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. రాజంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డ్ మెంబర్ మేడా మలికార్జున రెడ్డి ఇంటివద్ద రెక్కీ చేస్తుండగా అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది. అవసరమైతే చంపేందుకు సైతం వెనుకాడకుండా వారు ఒక పిస్టల్ ను కూడా సమకూర్చుకున్నారు.

ప్రాథమిక విచారణలో కర్నాటకలోని బళ్లారి, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో దోపిడీకి పాల్పడినట్లు వెల్లడైనట్లు సమాచారం. దొంగల వద్ద నుండి వేల రూపాయల నగదు, ఒక పిస్టల్, నాలుగు పిస్టల్ రౌండ్లు, ఒక కారు, మూడు మోటార్ సైకిల్ లు, 15 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని కడప జిల్లా ఎస్పీ అన్బు రాజన్ మీడియాకు వెల్లడించారు.