దూరమే మేలు..ఇంట్లో ఉండడమే కరోనాకు మందు

దూరమే మేలు..ఇంట్లో ఉండడమే కరోనాకు మందు

న్యూఢిల్లీ‘బయటకు రావొద్దు. ఇంట్లోనే ఉండండి, ప్లీజ్​’ అని డబ్ల్యూహెచ్​వో, నిపుణులు నెత్తీనోరూ కొట్టుకుని చెప్పినా చెవికి ఎక్కించుకోలేదు. ‘‘ఎహె.. వాళ్లు బాగానే చెప్తారు. మా పనులు ఎటు పోవాలె’’ అంటూ చాలా మంది ఆ మాటలను పట్టించుకోవట్లేదు. ఎవరికివాళ్లు ఇష్టమొచ్చినట్టు బయటకు వచ్చేస్తున్నారు. బార్లలో తాగుళ్లు, బీచుల్లో షికార్లు.. ఫలితం కేసుల్లో చైనా తర్వాతి స్థానం ఇటలీ, అమెరికాదే. ఆ రెండు దేశాల పరిస్థితి అంత దారుణంగా తయారైంది. ఇప్పుడు మన దేశంలోనూ అదే సీన్​ కనిపిస్తోంది. లాక్​డౌన్​ ఉన్నా చాలా మంది దానిని లెక్కచేయలేదు. అవసరం లేకపోయినా బయటకు వస్తున్నారు. దాని వల్ల కలిగే ఎఫెక్ట్​ను మరచిపోతున్నారు. ఇలాంటి టైంలో ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్​ రీసెర్చ్​ (ఐసీఎంఆర్​) ఓ స్టడీని విడుదల చేసింది. అందులో దూరమే (సోషల్​ డిస్టెన్సింగ్​) మేలు, ఇంట్లో ఉండడమే మందు అని పేర్కొంది.

కఠినమవ్వాల్సిందే

సస్పెక్టెడ్​ కేసులు, వైరస్​ లక్షణాలున్నోళ్లు హోం క్వారంటైన్​, సోషల్​ డిస్టెన్స్​ను కఠినంగా అమలు చేయాల్సిందేనని ఐసీఎంఆర్​ తేల్చి చెప్పింది. ఒకరి నుంచి మరొకరికి వైరస్​ పాకకుండా ఉండాలంటే అదే మంచి మందు అని పేర్కొంది. అలా చేస్తేనే దేశంలో కేసులను 62 శాతం వరకు తగ్గించొచ్చని పేర్కొంది. అందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది. నిజానికి కరోనాను డబ్ల్యూహెచ్​వో ప్యాండెమిక్​గా ప్రకటించినప్పుడే ఐసీఎంఆర్​ ఈ స్టడీ చేసింది. అయితే, ఇప్పుడు లాక్​డౌన్​ ప్రకటించడం, జనాలు బయటకు వచ్చేస్తుండడంతో దాని రిపోర్టును విడుదల చేసింది. ఇంటర్నేషనల్​ ప్యాసింజర్లు ఎక్కువగా వచ్చే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్​కతా సిటీలను స్టడీ కోసం ఎంపిక చేసుకుంది. ఓ కరోనా పేషెంట్​ 1.5 నుంచి 4.9 మంది వ్యక్తులకు వైరస్​ను అంటించేందుకు అవకాశమున్నట్టు మునుపటి స్టడీస్​ వెల్లడించాయి. వాటినే బేస్​గా తీసుకుని ఆప్టిమిస్టిక్​ (తక్కువముప్పు– 1.5), పెసిమిస్టిక్​ (ఎక్కువముప్పు– 4.9) సందర్భాలుగా స్టడీని వివరించింది.

కండిషన్స్​ అప్లై

అయితే ఇందులో కొన్ని పరిమితులూ ఉన్నట్టు ఐసీఎంఆర్​ వెల్లడించింది. లక్షణాలున్నప్పుడు ఓకే గానీ, లక్షణాలు లేనప్పుడు కరోనా బాధితులను గుర్తించడం కొంచెం కష్టమవుతుంది. ఇప్పటికే చాలా మందికి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్​ వచ్చిన సందర్భాలున్నాయి. అలాంటి టైంలో రెండు సందర్భాలను లెక్కలోకి తీసుకున్నా కేసుల సంఖ్యను తగ్గించడంలో తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్​ఫెక్షన్​ ఉండే టైం, వైరస్​ ఇంక్యుబేషన్​ టైం, మరణాల రేటు వంటివి దానిని ప్రభావితం చేసే అవకాశమూ ఉంది. ఆ నాలుగు సిటీలనే ఎంపిక చేసుకోవడానికి కారణాలనూ ఐసీఎంఆర్​ వివరించింది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను మాత్రమే ఈ స్టడీ కోసం తీసుకున్నామని, అందులో భాగంగానే దేశ జనాభాలో 7% జనాభా ఉన్న ఈ నాలుగు సిటీలను లెక్కలోకి తీసుకున్నట్టు చెప్పింది. అంతేగాకుండా వయసు ఎఫెక్ట్​నూ స్టడీలో లెక్కలోకి తీసుకోలేదు. ఐసీఎంఆర్​, లండన్​లోని ఇంపీరియల్​ కాలేజీకి చెందిన 8 మంది సైంటిస్టులు ఈ స్టడీలో భాగమయ్యారు.

టైంకు స్పందించాలి

ఆప్టిమిస్టిక్​ సందర్భంలో వెనువెంటనే చర్యలు తీసుకోవడం వల్ల ఢిల్లీలో కేసుల సంఖ్య భారీగా పెరగడానికి 400 నుంచి 600 రోజులు పడుతుంది. ఇలాంటి సందర్భంలో హెల్త్​ అధికారులు వైరస్​ను ఎదుర్కొనేందుకు టైం దొరుకుతుంది. ఆ లోపు ప్రభుత్వమూ మౌలిక వసతులు కల్పించడానికి వీలవుతుంది. ఇదే సందర్భంలో టైంకు స్పందించకపోతే కేవలం 200 రోజుల్లోనే కేసులు విపరీతంగా పెరిగిపోయి హెల్త్​ అధికారులు స్పందించడానికి టైం కూడా దొరకదు. దీంతో సిబ్బందిపై భారం ఎక్కువగా పడుతుంది. తర్వాత వచ్చే కేసులను డీల్​ చేయడం కష్టంగా మారిపోతుంది. అదే పెసిమిస్టిక్​ సందర్భంలో మాత్రం జస్ట్​ 50 రోజుల టైం కూడా ఉండదు. అంటే కరోనా ఉన్న ఒక వ్యక్తి 4.9 మందికి అప్పటికే వైరస్​ అంటించి ఉంటాడు కాబట్టి, అప్పుడు స్పందించినా, స్పందించకపోయినా పెద్దగా తేడా ఏమీ ఉండదు. అప్పటికే నష్టం జరిగిపోతుంది.

చైనాలో ఇంకో వైరస్..హంటా వైరస్ తో ఒకరు బలి