న్యూఢిల్లీ: ‘బయటకు రావొద్దు. ఇంట్లోనే ఉండండి, ప్లీజ్’ అని డబ్ల్యూహెచ్వో, నిపుణులు నెత్తీనోరూ కొట్టుకుని చెప్పినా చెవికి ఎక్కించుకోలేదు. ‘‘ఎహె.. వాళ్లు బాగానే చెప్తారు. మా పనులు ఎటు పోవాలె’’ అంటూ చాలా మంది ఆ మాటలను పట్టించుకోవట్లేదు. ఎవరికివాళ్లు ఇష్టమొచ్చినట్టు బయటకు వచ్చేస్తున్నారు. బార్లలో తాగుళ్లు, బీచుల్లో షికార్లు.. ఫలితం కేసుల్లో చైనా తర్వాతి స్థానం ఇటలీ, అమెరికాదే. ఆ రెండు దేశాల పరిస్థితి అంత దారుణంగా తయారైంది. ఇప్పుడు మన దేశంలోనూ అదే సీన్ కనిపిస్తోంది. లాక్డౌన్ ఉన్నా చాలా మంది దానిని లెక్కచేయలేదు. అవసరం లేకపోయినా బయటకు వస్తున్నారు. దాని వల్ల కలిగే ఎఫెక్ట్ను మరచిపోతున్నారు. ఇలాంటి టైంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఓ స్టడీని విడుదల చేసింది. అందులో దూరమే (సోషల్ డిస్టెన్సింగ్) మేలు, ఇంట్లో ఉండడమే మందు అని పేర్కొంది.
కఠినమవ్వాల్సిందే
సస్పెక్టెడ్ కేసులు, వైరస్ లక్షణాలున్నోళ్లు హోం క్వారంటైన్, సోషల్ డిస్టెన్స్ను కఠినంగా అమలు చేయాల్సిందేనని ఐసీఎంఆర్ తేల్చి చెప్పింది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ పాకకుండా ఉండాలంటే అదే మంచి మందు అని పేర్కొంది. అలా చేస్తేనే దేశంలో కేసులను 62 శాతం వరకు తగ్గించొచ్చని పేర్కొంది. అందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది. నిజానికి కరోనాను డబ్ల్యూహెచ్వో ప్యాండెమిక్గా ప్రకటించినప్పుడే ఐసీఎంఆర్ ఈ స్టడీ చేసింది. అయితే, ఇప్పుడు లాక్డౌన్ ప్రకటించడం, జనాలు బయటకు వచ్చేస్తుండడంతో దాని రిపోర్టును విడుదల చేసింది. ఇంటర్నేషనల్ ప్యాసింజర్లు ఎక్కువగా వచ్చే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా సిటీలను స్టడీ కోసం ఎంపిక చేసుకుంది. ఓ కరోనా పేషెంట్ 1.5 నుంచి 4.9 మంది వ్యక్తులకు వైరస్ను అంటించేందుకు అవకాశమున్నట్టు మునుపటి స్టడీస్ వెల్లడించాయి. వాటినే బేస్గా తీసుకుని ఆప్టిమిస్టిక్ (తక్కువముప్పు– 1.5), పెసిమిస్టిక్ (ఎక్కువముప్పు– 4.9) సందర్భాలుగా స్టడీని వివరించింది.
కండిషన్స్ అప్లై
అయితే ఇందులో కొన్ని పరిమితులూ ఉన్నట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. లక్షణాలున్నప్పుడు ఓకే గానీ, లక్షణాలు లేనప్పుడు కరోనా బాధితులను గుర్తించడం కొంచెం కష్టమవుతుంది. ఇప్పటికే చాలా మందికి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ వచ్చిన సందర్భాలున్నాయి. అలాంటి టైంలో రెండు సందర్భాలను లెక్కలోకి తీసుకున్నా కేసుల సంఖ్యను తగ్గించడంలో తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఉండే టైం, వైరస్ ఇంక్యుబేషన్ టైం, మరణాల రేటు వంటివి దానిని ప్రభావితం చేసే అవకాశమూ ఉంది. ఆ నాలుగు సిటీలనే ఎంపిక చేసుకోవడానికి కారణాలనూ ఐసీఎంఆర్ వివరించింది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను మాత్రమే ఈ స్టడీ కోసం తీసుకున్నామని, అందులో భాగంగానే దేశ జనాభాలో 7% జనాభా ఉన్న ఈ నాలుగు సిటీలను లెక్కలోకి తీసుకున్నట్టు చెప్పింది. అంతేగాకుండా వయసు ఎఫెక్ట్నూ స్టడీలో లెక్కలోకి తీసుకోలేదు. ఐసీఎంఆర్, లండన్లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన 8 మంది సైంటిస్టులు ఈ స్టడీలో భాగమయ్యారు.
టైంకు స్పందించాలి
ఆప్టిమిస్టిక్ సందర్భంలో వెనువెంటనే చర్యలు తీసుకోవడం వల్ల ఢిల్లీలో కేసుల సంఖ్య భారీగా పెరగడానికి 400 నుంచి 600 రోజులు పడుతుంది. ఇలాంటి సందర్భంలో హెల్త్ అధికారులు వైరస్ను ఎదుర్కొనేందుకు టైం దొరుకుతుంది. ఆ లోపు ప్రభుత్వమూ మౌలిక వసతులు కల్పించడానికి వీలవుతుంది. ఇదే సందర్భంలో టైంకు స్పందించకపోతే కేవలం 200 రోజుల్లోనే కేసులు విపరీతంగా పెరిగిపోయి హెల్త్ అధికారులు స్పందించడానికి టైం కూడా దొరకదు. దీంతో సిబ్బందిపై భారం ఎక్కువగా పడుతుంది. తర్వాత వచ్చే కేసులను డీల్ చేయడం కష్టంగా మారిపోతుంది. అదే పెసిమిస్టిక్ సందర్భంలో మాత్రం జస్ట్ 50 రోజుల టైం కూడా ఉండదు. అంటే కరోనా ఉన్న ఒక వ్యక్తి 4.9 మందికి అప్పటికే వైరస్ అంటించి ఉంటాడు కాబట్టి, అప్పుడు స్పందించినా, స్పందించకపోయినా పెద్దగా తేడా ఏమీ ఉండదు. అప్పటికే నష్టం జరిగిపోతుంది.