![విదేశాల్లో ఉన్నోళ్లకే ఇండియాపై ఆసక్తి ఎక్కువ: కేటీఆర్](https://static.v6velugu.com/uploads/2023/01/Minister-KTR_R2lSHNThBd.jpg)
- నేనూ కూడా ఒకప్పుడు ఎన్ఆర్ఐనే
- దేశంలో ఉన్నోళ్ల కంటే.. విదేశాల్లో ఉన్నోళ్లకే ఇండియాపై ఆసక్తి ఎక్కువ
- స్విట్జర్లాండ్ ఎన్ఆర్ఐల సభలో మంత్రి కేటీఆర్ కామెంట్స్
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ప్రభుత్వంతో కలిసి రావాలని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని స్విట్జర్లాండ్ లోని ఎన్ఆర్ఐలకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తోందని తాను గర్వంగా చెప్పగలనన్నారు. స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్నగరంలో ఎన్ఆర్ఐలు ఏర్పాటు చేసిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. తాను కూడా ఒకప్పుడు ఎన్ఆర్ఐనేనని, చాలా కాలం విదేశాల్లో పనిచేసి ఇండియాకు తిరిగి వెళ్లానని గుర్తు చేశారు. ఇండియాలో ఉన్న వాళ్లకంటే, విదేశాల్లో ఉన్నోళ్లకే మన దేశ వ్యవహారాలు, అభివృద్ధిపై ఎక్కువ ఆసక్తి ఉంటుందన్నారు. మానవ జీవితం పరిమిత కాలమేనని నమ్మి, సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో చేపడుతోందన్నారు. గ్రామీణ ప్రాంత జీవితాన్ని కేసీఆర్ అర్ధం చేసుకున్నంత గొప్పగా.. దేశంలో ఇంకెవరూ అర్ధం చేసుకోలేదని కేటీఆర్ కొనియాడారు. గ్రామాలకు కావాల్సిన కనీస మౌలిక వసతులను దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై కొంతమంది తప్పుగా మాట్లాడుతున్నారని.. ప్రజలకు అవసరమైన నిర్మాణాలు చేపట్టేందుకు అప్పు చేస్తే అది తప్పు ఎలా అవుతుందని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర సర్కార్ వంద లక్షల కోట్లు అప్పు చేసి, ఒక్క మంచి పని కూడా చేయలేదన్నా రు. ఇండియా గ్లోబల్ క్యాపిటల్ ఆఫ్ పూర్ పీపుల్గా మారిందని.. ఈ విషయాన్ని ఎన్ఆర్ఐలు తెలుసుకోవాలన్నారు.
హైదరాబాద్లో ‘రెవల్యూషన్ సెంటర్’
రాష్ట్ర ప్రభుత్వం, డబ్ల్యూఈఎఫ్ మధ్య కుదిరిన ఒప్పందం
హైదరాబాద్, వెలుగు: ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) నిర్ణయించింది. స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరుగుతున్న సదస్సులో దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. భాగ్యనగరంలో ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సెంటర్ ఏర్పాటుపై రాష్ట్ర సర్కారుకు, డబ్ల్యూఈఎఫ్ కు మధ్య ఒప్పందం కుదిరింది. మంత్రి కేటీఆర్, ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్జ్ బ్రెందే సమక్షంలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్, ఎకనామిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరేమీ జర్గన్స్ ఒప్పందంపై సంతకాలు చేశారు. హైదరాబాద్లో ఏర్పాటు చేయబోయే సెంటర్లో లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ సెక్టార్లపై ప్రత్యేకంగా అధ్యయనం చేయనున్నారు.