కేసీఆర్​ అవినీతిపై  చర్యలు తప్పవ్

కేసీఆర్​ అవినీతిపై  చర్యలు తప్పవ్

ఆయన అక్రమ సంపాదనంతా ప్రజలకు చెందాల్సిందే: లక్ష్మణ్

మునుగోడు ఎన్నిక తర్వాత టీఆర్ఎస్​కు వీఆర్ఎస్ ఖాయం

హైదరాబాద్, వెలుగు: దర్యాప్తు సంస్థలకు సీఎం కేసీఆర్ అవినీతిపై ఎన్నో ఫిర్యాదులు అందినయని, టైమ్ ను బట్టి ఆయనపై చర్యలు ఉంటాయని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ కె. లక్ష్మణ్​ చెప్పారు. యూపీలో అక్రమంగా సంపాదించినోళ్ల నుంచి రూ.12 వేల  కోట్లను యోగి సర్కారు స్వాధీనం చేసుకుందని గుర్తుచేశారు. అదే రీతిలో ఇక్కడ కేసీఆర్ సర్కారు, ఆయన కుటుంబం సంపాదించిన అక్రమ సంపాదన కూడా ప్రజలకే చెందాలని అన్నారు. ఉద్యమంలో ఉన్నప్పుడు కేసీఆర్ సంపాదన ఎంత, ఇప్పుడు ఎంతనేది అందరికీ తెలుసని అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో జరిగిన మీట్​ది ప్రెస్​లో లక్ష్మణ్ మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలులో రాష్ట్ర బీజేపీ నేతల ప్రమేయం లేదన్నారు. ఈ అంశానికి సంబంధించిన స్క్రిప్ట్ అంతా ప్రగతి భవన్ లోనే తయారయిందన్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు వేరే పార్టీ నుంచి గెలిచిన వారేనని, వాళ్లను ఏమిచ్చి టీఆర్ఎస్​లో చేర్చుకున్నారో చెప్పాలని కేసీఆర్ ను ప్రశ్నించారు. ఏ తప్పు చేయకపోతే వాళ్లను ప్రగతి భవన్​లో 4 రోజులు ఎందుకు దాచినవని మండిపడ్డారు.టీఆర్ ఎస్ నుంచి  85 మంది గెలిస్తే మరో 20 మందిని ఎందుకు కొన్నావని సీఎంను ఆయన ప్రశ్నించారు.

తప్పుచేయకపోతే సీబీఐ అంటే భయమెందుకు?

తప్పు చేయకపోతే సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా చీకటి జీవో ఎందుకు తెచ్చారని కేసీఆర్​పై లక్ష్మణ్ మండిపడ్డారు. కేసీఆర్​కు గుణపాఠం చెప్పాలంటే బీజేపీతోనే సాధ్యమని, మునుగోడులో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. దుబ్బాక, హుజూరాబాద్​లో వచ్చిన రిజల్టే మునుగోడులో వస్తుందన్నారు. ఈ ఎన్నికతో బీఆర్ఎస్​కు వీఆర్ఎస్ ఖాయమన్నారు.

చేనేతపై హరీశ్, కేటీఆర్​వి అబద్ధాలు

చేనేతమీద జీఎస్టీ విధింపుపై మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు అబద్ధాలు ఆడుతున్నారని లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. చేనేతపై జీఎస్టీని 2017 లో అప్పటి ఆర్థిక మంత్రి అంగీకరించినట్లు హరీశ్ చెప్తుంటే.. కేటీఆర్ మాత్రం జీఎస్టీ 5% ఉండాలని తాను కోరానని అన్న వీడియోను లక్ష్మణ్ తన మొబైల్​లో మీడియాకు చూపించారు. చేనేతకు 2.5 జీఎస్టీ రాష్ట్రానికి వస్తుందని, దానిని ఎందుకు వదులుకోవట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఓటమి తప్పదనే ​దాడులు

మునుగోడులో టీఆర్ఎస్ పార్టీకి ఓటమి ఖరారవడంతో ఆ పార్టీ నేతలు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. ఈటల రాజేందర్ కాన్వాయ్, సిబ్బందిపై టీఆర్ ఎస్ రౌడీలు దాడి చేయడాన్ని మంగళవారం ఓ ప్రకటనలో ఖండించారు. ఇలాంటి బెదిరింపులకు బీజేపీ కార్యకర్తలు భయపడకుండా సంయమనం పాటించాలని కోరారు.  మునుగోడు బైపోల్ లో టీఆర్ఎస్ ఓటమి పక్కా అయిందని బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీ కే అరుణ అన్నారు. అందుకే దాడులకు పాల్పడుతున్నారని ఓ ప్రకటనలో తెలిపారు.