దుబాయ్: బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్ లో విఫలమైన సన్ రైజర్స్ హైదరాబాద్ యంగ్ స్టార్స్ ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మకు.. కెప్టెన్ డేవిడ్ వార్నర్ మద్దతుగా నిలిచాడు. రాబోయే మ్యాచ్ ల్లో నేచురల్ గేమ్ ను ఆడాలని సూచించా డు. కుర్రాళ్లపై తనకు ఇంకా నమ్మకం ఉందని చెప్పాడు. ‘మిడిలార్డర్ కు ప్రియమ్, అభిషేక్ చక్కగా సరిపోతారు. కాబట్టి వాళ్లను నమ్మాల్సిందే. ఎవరైనా మిడిలార్డర్ బ్యాటింగ్ను విమర్శిస్తే .. గతంలో వీళ్ల ఆటను చూసి ఉండరు. పరిస్థితులను బట్టి వాళ్లను ఎంకరేజ్ చేయాలి.
సీనియర్ ప్లేయర్ల గైడెన్స్ ప్రకారం కుర్రాళ్లు నడుచుకుంటే కచ్చితంగా సక్సెస్ అవుతారు. అందుకే ప్లేయర్లు తమ నేచురల్ గేమ్ ఆడాలన్నదే నా కోరిక. మిడిల్ ఓవర్లలో క్రాస్ బ్యాట్ షాట్లు ఆడటం చాలా కష్టం. వీలైనంతగా స్ట్రెయిట్ షాట్సే ఎక్కువగా ఆడాలి. బాల్ పేస్ ను బట్టి బ్యాటింగ్లో మార్పు రావాలి. అయితే ఈ మ్యాచ్ లో త్వరగా వికెట్లు కోల్పోవడం మా మూమెంట్ ను దెబ్బతీసింది. ఎండ్ వరకు ఒకరిద్దరు బ్యాట్స్మన్ కూడా క్రీజులో లేకపోవడం నిరాశ కలిగించింది’ అని వార్నర్ పేర్కొన్నాడు.
ఫీల్డింగ్ తప్పిదాలపై మాట్లాడుతూ.. ‘యూఏఈలో హైటవరింగ్ లైట్స్ కింద ఆడటం చాలా భిన్నంగా ఉంటుంది. స్టేడియం చుట్టూ టవర్స్ ఉంటాయి. అందుకే బాల్ ఎక్కువ ఎత్తుకు వెళ్తే విజన్ లో తేడా వస్తుంది. అందుకే హై క్యాచ్ ల విషయంలో కొన్ని ఎర్రర్స్ జరుగుతుంటాయి. మ్యాచ్ లు గడిచేకొద్ది ఫీల్డింగ్ పరిస్థితి మారుతుంది’ అని వార్నర్ చెప్పుకొచ్చాడు.