నైట్ రైడర్స్ లెక్క సరిచేసేనా?
ప్లే ఆఫ్ బెర్త్ కోసం హోరాహోరీ
అబుదాబి: సన్రైజర్స్పై సూపర్ విక్టరీ సాధించి రెట్టించిన ఉత్సాహంతో ఉన్న కోల్కతా నైట్రైడర్స్ ప్లే ఆఫ్ అవకాశాలు ఇంప్రూవ్ చేసుకోవడమే టార్గెట్గా మరో పోరుకు రెడీ అయ్యింది. టేబుల్లో తమ కంటే ఒక స్థానం ముందున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో బుధవారం అమీతుమీ తేల్చుకోనుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన లాస్ట్ మ్యాచ్లో విరాట్ సేన 82 రన్స్ తేడాతో గెలిచింది. అయితే న్యూజిలాండ్ ఆల్రౌండర్ లూకీ ఫెర్గుసన్ చేరికతో కేకేఆర్ ఇప్పుడు మరింత బలంగా తయారైంది. సన్రైజర్స్పై చేసిన పెర్ఫామెన్స్ను లూకీ రిపీట్ చేయాలని కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ భావిస్తున్నాడు. ఇంకో ఐదు మ్యాచ్లు మిగిలుండగా.. ప్రస్తుతం 10 పాయింట్లతో టేబుల్లో నాలుగో ప్లేస్లో ఉన్న కోల్కతాకు ఆర్సీబీపై గెలవడం చాలా అవసరం. మరోపక్క ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో 12 పాయింట్లు సాధించి మూడో ప్లేస్లో ఉన్న ఆర్సీబీ మరో విజయం సాధించి ప్లే ఆఫ్స్కు మరింత దగ్గరవ్వాలని భావిస్తోంది. దీంతో మరో హోరాహోరీ పోరు ఖాయమనే చెప్పాలి. అయితే, ఫెర్గుసన్ను మోర్గాన్ ఎలా యూజ్ చేసుకుంటాడనే దానిపై కోల్కతా అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఫామ్లో లేని ఆండ్రీ రసెల్ ప్లేస్లో సునీల్ నరైన్కు చాన్స్ ఇస్తారో లేదో చూడాలి. మరోపక్క ఆర్సీబీకి పెద్దగా సమస్యల్లేవు. మోరిస్ రాకతో జట్టుకు మరింత బ్యాలెన్స్ వచ్చింది.