
మిడ్జిల్, వెలుగు: రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి పేర్కొన్నారు. మిడ్జిల్ ఎంపీడీవో ఆఫీస్లో బుధవారం లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డు పేద కుటుంబానికి భరోసా వంటిదని, జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో కీలకమన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని విమర్శించారు.
మండలానికి 440 కొత్త రేషన్ కార్డులు, 2,343 కార్డుల్లో చేర్పులు పూర్తయ్యాయని తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గానికి 22 కొత్త సబ్ స్టేషన్లు మంజూరయ్యాయని చెప్పారు. మిడ్జిల్ నుంచి కొత్తపల్లి వరకు డబుల్ రోడ్డు పనులు జరుగుతున్నాయని, వాడ్యాల- వేముల–మసిగుండ్లపల్లి–చెన్నంపల్లి వరకు, రాణిపేట–సింగందొడ్డి వరకు డబుల్ రోడ్లను మంజూరు చేయించామని తెలిపారు. ఏఎంసీ చైర్పర్సన్ తంగెళ్ల జ్యోతి, తహసీల్దార్ రాజు, టీపీసీసీ సెక్రటరీ రబ్బానీ, అల్వాల్ రెడ్డి, గౌస్ పాల్గొన్నారు.